దేశంలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఢిల్లీలో తాజాగా మరో కేసు నమోదవగా, మొత్తం అక్కడ కేసుల సంఖ్య మూడుకు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8 కేసులు నమోదవగా..అందులో ఢిల్లీలో మూడు, కేరళలో ఐదు కేసులు ఉన్నాయి.
కాగా రోగ నిర్ధారణ, వ్యాక్సిన్ ల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారతదేశంలో మొదటి కేసు జూలై 14న కేరళలో నమోదవగా, అంతకుముందు మే 1న కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
అనుమానిత కేసుల నుండి నమూనాలను సేకరించి పరీక్షల కోసం గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు పంపుతున్నట్లు వెల్లడించారు మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరస్. మశూచి లాంటిదే మంకీపాక్స్ కూడా. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కొనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు.
1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి రోగులను గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరుకుంది. మంకీపాక్స్ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి.
ఒక్కోసారి శరీరమంతా ఇవి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 2-4 వారాలపాటు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.