తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందనే తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్లో ప్రశాంతంగా ఒక రోజు పర్యటనను పూర్తిచేసుకొని వెనుతిరగడంతో చైనా చిందులేసింది. ఆమె తైవాన్ లో ఉండగానే తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం ప్రకటించింది.
చైనా నుంచి తైవాన్కు ఇసుక రవాణాను కూడా ఆపేస్తున్నట్టు వెల్లడించింది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాల దిగుమతులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. ఈ పండ్లలో పురుగుల మందు (పెస్టిసైడ్స్ ) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయని, ప్యాకింగ్పై పరీక్షలు చేయగా, కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని పేర్కొంది.
పదేపదే ఈ తరహా ఆనవాళ్లు గుర్తించిన తరువాత ఈ చర్యలు తీసుకున్నట్టు కారణంగా చూపింది. చైనా నుంచి తైవాన్కు ఇసుక రవాణాను నిలిపివేతను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేక ప్రకటనలో నిర్ధారించింది.
తన భూభాగంగా చైనా చెప్పుకొంటున్న తైవాన్లో అమెరికాకు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి పర్యటించడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నాన్సీ పెలోసి తైపీ పర్యటన విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా తేల్చి చె ప్పడంతో చైనా సైన్యం దూకుడు ప్రదర్శిస్తోం ది.
తైవాన్ లక్షంగా చైనా ఆంక్షలు విధించడం కొత్తేమీ కాదు. 2021 మార్చిలో తైవాన్ నుంచి పైన్యాపిల్ దిగుమతులను చైనా నిలిపివేసింది. తైవాన్ అధ్యక్షురాలిగా త్సాయ్ ఇంగ్ వెన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చైనా ఒత్తిళ్లు పెరిగాయి. తైవాన్ చైనాలో అంతర్భాగం కాదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశమని త్సాయ్ ఇంగ్వెన్ చెబుతుండటము ఈ ఒత్తిళ్లకు కారణంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనను నిరసిస్తూ చైనా మిలిటరీ కసరత్తు నిర్వహించనున్నట్టు చైనా అధికారులు ప్రకటించారు. తైవాన్లోని కీలక ఓడరేవుల్లోనూ, పట్టణా ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని చైనా బెదిరింపులు దిగుతుందని తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తైవాన్ సరిహద్దు ప్రాంతానికి సుమారు 20 కిలో మీటరల దూరంలో మిలటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు చైనీస్ పిపుల్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. అయినా దాదాపు 23 మిలయన్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజలు ఎప్పటికైన చైనా దండయాత్ర చేస్తుందన్న దీర్ఘకాలిక భయాలతోనే జీవిస్తున్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హయాంలో ఆ ముప్పు మరింత తీవ్రతరమైంది