అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ ) మరోసారి వడ్డీ రేట్లు పెంచేసింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది. మూడు రోజులపాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమీక్ష గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమై, అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
35 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును పెంపుదల చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఆర్బీఐ వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. 100 బేసిస్ పాయింట్లు ఒక శాతం లేదా ఒక రూపాయికి సమానం. అంటే ఇప్పుడు వడ్డీ రేటు 50 పైసలు పెరిగింది.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇప్పటికే మే-జూన్ నెలల్లో రెండు విడతలుగా రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచింది. దీంతో గత రెండు నెలల్లో అనేక బ్యాంకులు తమ వడ్డీ రేట్లు పెంచాయి. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
దాంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలనెలా చెల్లించే ఈఎంఐల భారం మరింత పెరగనుంది. అయితే డిపాజిట్ దారులకు ఆ మేరకు అదనపు వడ్డీ లభిస్తుంది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీని రెపో రేటు అంటారు. ఇప్పుడు రెపో రేటు 5.40 శాతానికి చేరుకుంది. రెపో రేటు పెరిగితే, బ్యాంకులు ఖాతాదారులకు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా వినియోగదారులకు ఈఎంఐ భారంగా మారనుంది.