మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ హెచ్చరించారు. 62 వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి బీఎస్ఎన్ఎల్కు కేంద్రం ఈమధ్యే రూ 1.64 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు.
ఇకపై బీఎస్ఎన్ఎల్ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని, ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదేం చిన్న కేటాయింపు కాదని, పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదని ఆయన పేర్కొన్నారు.
“ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం” అంటూ కేంద్ర మంత్రి ఉద్యోగులను హెచ్చరించారు.
బీఎస్ఎన్ఎల్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్ భారీ ప్యాకేజీని ప్రకటించిందని, తాము చేయవలసింది చేశామని ఇక ఇప్పుడు చేయాల్సింది ఉద్యోగులే అని హితవు చెప్పారు. “ఈ పోటీ పరిశ్రమలో మీ పనితీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాబోయే 24 నెలల్లో మంచి ఫలితాలను చూడాలనుకుంటున్నా. నేనే మీ పనితీరుపై నెలవారీ నివేదిక చూస్తా” అంటూ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
గురువారం బీఎస్ఎన్ఎల్ సీనియర్ మేనేజ్మెంట్తో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు లీక్ అయ్యింది. అయితే ఆ ఐదు నిమిషాల క్లిప్ ఒరిజినల్దే అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బిబిఎన్ఎల్)ని బీఎస్ఎన్ఎల్తో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విలీనం ద్వారా, బీఎస్ఎన్ఎల్ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ను అదనంగా పొందుతుంది. ప్రస్తుతం, బీఎస్ఎన్ఎల్కు 6.83 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉంది.