స్వాతంత్య్ర వజ్రోత్సవాలను భారత్ ఘనంగా జరుపుకొంటున్న సమయంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలను గుర్తించిన భద్రతా దళాలు, వాటిని నిర్జీవ ప్రాంతంలో పేల్చివేశాయి.
ఈ పేలుడు పదార్ధాలు దాదాపు 25 నుంచి 30 కిలోల వరకు ఉండొచ్చని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. పుల్వామా లోని తహబ్ క్రాసింగ్ వద్ద సుమారు 25 నుంచి 30 కిలోల పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు , పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాటిని ముందస్తుగా గుర్తించి పెను ప్రమాదాన్ని నివారించగలిగాం అని జమ్ముకశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.
‘పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై సుమారు 25-30 కిలోలు ఉన్న ఐఈడీని పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా పోలీసులకు అందిన సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకోగలిగాం.’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్న వేళ ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఐఎస్ఐఎస్ సంస్థతో సంబంధం ఉన్న సాబుద్దీన్ అనే వ్యక్తిని ఉగ్రవాద వ్యతిరేక దళం ఉత్తరప్రదేశ్ లోని అజమ్గఢ్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిపై ఐపీసీతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధాల చట్టానికి సంబంధించి పలు కేసులు నమోదు చేశారు.
ఆర్మీ క్యాంప్పై ఆత్మాహుతి దాడి
జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపులోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కి.మీ దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజౌరీలోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున పట్టుబట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు.