భారత దేశం వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోకుండా శ్రీలంక అనుమతి ఇవ్వడంతో చైనా నిఘా కోసం ఉద్దేశించిన యుద్ధనౌక యువాన్ వాంగ్ 5 షిప్ వచ్చేవారం శ్రీలంక తీరంకు చేరుకోనుంది. చైనా స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఒక రీసెర్చ్, సర్వే షిప్ అని ఇంటర్నేషనల్ షిప్పింగ్, అనలిటిక్ సైట్లు స్పష్టం చేస్తున్నాయి.
చైనా స్పై షిప్ ఆగస్టు 11నే శ్రీలంకకు రావాల్సిఉంది. అయితే భారత్ అనుమతులు ఇవ్వొద్దని సూచించడంతో లంక మొదట్లో అనుమతి నిరాకరించింది. తాజాగా ఈ యుద్ధ నౌకకు శ్రీలంక అనుమతిచ్చింది. ఈ విషయాన్ని శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పీ సిల్వా వెల్లడించారు. స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఆగస్టు 16 నుంచి 22 మధ్య రావడానికి అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నౌకను హ్యాండిల్ చేయడానికి స్థానిక ఏజెంట్లతోనూ మాట్లాడుతామని వెల్లడించారు. ప్రస్తుతం చైనా షిప్ పోర్టు నుంచి ఆగ్నేయం వైపుగా సుమారు 1000 కి. మీ దూరంలో ఉంది. భారత్ వద్దన్నా..చైనా స్పై షిప్కు లంక అనుమతులివ్వడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
హిందూ మహాసముద్రం, శ్రీలంకపై చైనా తన ప్రభావాన్ని పెంచుకున్నట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే యువాన్ వాంగ్ 5 షిప్ను శాటిలైట్ల ట్రాకింగ్ కోసం పంపుతున్నారనే అనుమానం వ్యక్తం చేస్తోంది.
అలాగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో చైనా ఈ షిప్ను ఉపయోగించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ షిప్ భారత కార్యకలాపాలు, భారత మిలిటరీ కేంద్రాలు వంటి పలు అంశాలపై నిఘా వేసే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే శ్రీలంకల హంబంటోటా పోర్టుకు రావడాన్ని భారత్ అభ్యంతరం తెలిపింది.
మరోవైపు చైనా షిప్ శ్రీలంక వస్తుండటాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత రక్షణ, ఆర్థిక ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొలంబోలో సౌత్ పోర్టు హంబంటోటాను చైనా నిర్మించింది.
ఇందు కోసం శ్రీలంక చైనా కంపెనీకి 1.4 బిలియన్ డాలర్లు చెల్లించింది. ఆ తర్వాత ఈ పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. అయితే నిర్మాణానికి తీసుకున్న దాని కంటే తక్కువ మొత్తం అంటే 1.12 బిలియన్ డాలర్లను చైనా లంకకు చెల్లించడం గమనార్హం.