గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా. ఆయన వయసు 62సంవత్సరాలు. ఆదివారం ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు.
ఝున్ఝున్వాలా ఈ మధ్యే విమానయాన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది. ఇండియన్ వారెన్ బఫెట్గా పేరుగాంచిన ఆయన 1985లో స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టారు.
ఆయన పెట్టుబడిదారుడిగానే కాకుండా ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్గా ఉన్నారు. జూలై 5,1960లో మధ్యతరగతి కుటుంబంలో హైదరాబాద్ లో జన్మించిన రాకేష్ ఝున్ఝున్ వాలాకు చిన్న తనం నుంచి వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.
ఓ వైపు సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) చదువు కుంటూనే స్టాక్ మార్కెట్లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెటర్గా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం అతని నికర ఆస్థి విలువ రూ.5.5 బిలియన్లుగా ఉంది. రాకేష్ ఝున్ఝున్వాలా 1986లో టాటా టీ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా తాను మొదటి సారి భారీ లాభాలను ఆర్జించారు.
ఆయన టాటా టీ 5,000 షేర్లను కేవలం 43 రూపాయలకు కొనుగోలు చేశారు. తర్వాత మూడు నెలల్లో ఆ స్టాక్ 143 రూపాయలకు పెరిగింది. అతను మూడు రెట్లు ఎక్కువ లాభం పొందాడు. ఆ తర్వాత మూడేండ్లలో ఝున్జున్వాలా రూ.20 నుంచి రూ 25 లక్షలు సంపాదించారు. ఆయన్ని అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారునిగా బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు.
రాకేష్ ఝున్ ఝున్వాలా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఝున్ఝున్వాలా అలుపెరగని వ్యక్తి అని, ఆర్థిక ప్రపంచానికి చెరగని సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ఆయన మరణం బాధాకరమని… అతని కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి తెలుపుతూ ఓం శాంతి అని ట్వీట్ చేశారు.
రాకేష్ ఝున్ ఝున్వాలా మృతి పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట్లాది మందికి సంపద సృష్టికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు,స్నేహితులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.