ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో జరిగిన దాడి అంతర్జాతీయంగా కలకం సృష్టిస్తున్న సమయంలో బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్ (57)కు చంపేస్తామంటూ బెదిరింపు వచ్చింది. సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని ఖండిస్తూ హ్యారీ పోటర్ రచయిత రౌలింగ్ ట్వీట్ చేయగా.. ఆమెకు ఈ బెదిరింపు వచ్చింది.
పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్చేశారు.
దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడని పేర్కొన్నారు.
ఇలా ఉండగా, ప్రస్తుతం సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కాస్త అదుపులోకి రావడంతో వెంటిలేటర్ తొలగించారని, ప్రస్తుతం రష్దీ మాట్లాడుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. అత్యవసర చికిత్సలో భాగంగా వైద్యులు నిరంతరం శ్రమించడంతో రష్దీ ఆరోగ్య పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు.