ఆరు, ఏడు నెలల తర్వాత తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎవరైతే పొరపాట్లు చేశారో వారందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. జనగాంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సోమవారం జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్ దాడిని మంత్రి సమర్ధించుకోవడం ఘోరమని ధ్వజమెత్తారు.
బండి సంజయ్ పాదయాత్రతో టీఆర్ఎస్ పీఠాలు కదిలిపోతున్నాయని, అందుకే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని దాడులు చేసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు గ్రామ గ్రామాన పాతరేస్తారని హెచ్చరించారు. ఆరు నెలల్లో తెలంగాణలో అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గానీ, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని గాని ఎవరు రక్షించలేరని స్పష్టం చేశారురు. ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాజ్యాంగ పరిధిలో ఎన్నికలు జరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని దాడులు జరిగినా ప్రజలు టీఆర్ఎస్ని ఓడిస్తారని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు మంచివి కావన్న కేంద్ర మంత్రి అధికార పక్షానికి హితవు చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీకి పోలీస్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన హితవు చెప్పారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని గుర్తు చేశారు. పోలీసు అధికారులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కనుసనల్లో పని చేస్తున్నట్టు కనిపిస్తుందని ఆరోపించారు.
కేసీఆర్కు పోగాలం దాపురించింది
కాగా, తన యాత్రపై జరిగిన దాడి పట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ముఖ్యమంత్రి కేసీఆర్కు పోగాలం దాపురించింది. విసునూరు దొర రామచంద్రారెడ్డి వారసుడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు కేటీఆర్ ట్విట్టర్ టిల్లు లా ఉన్నారు. ప్రజాసమస్యలపై పట్టింపు లేదు’ అంటూ మండిపడ్డారు.
`సమస్యలపై ప్రశ్నిస్తే రైతులకు బేడీలు వేసి, జైలుకు పంపిస్తున్నారు. నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారు. హత్యలు చేయించేందుకు వెనుకాడటం లేదు. ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. అందుకే కేసీఆర్ నిరంకుశ పాలనను బొందపెట్టటానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం’అని ధ్వజమెత్తారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల నుంచి పాలకుర్తి వరకు 15.7 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అంతకుముందు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డిగూడెం ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రసంగించారు.
టీఆర్ఎస్ గూండాలు దాడిచేసినా.. పోలీసులు సరిగా వ్యవహరించలేదని బండి సంజయ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు శాంతియుతంగా యాత్ర చేస్తుంటే అడ్డుకుంటారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల మధ్య తిరిగి సమస్యలు తెలుసుకుంటే.. మేము ఎండనకా, వాననకా పాదయాత్ర ఎందుకు చేస్తాం? సీఎంకు దమ్ముంటే పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లమనండి. నేను వెంటనే పాదయాత్రను ఆపేస్తా’అని సవాల్ విసిరారు.
కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారన్నారని, ఆయనకు మందు మీదున్నంత ప్రేమ మంది మీదలేదని దుయ్యబట్టారు. కాగా, బండి సంజయ్కుమార్ చేపట్టిన పాదయాత్ర మంగళవారంతో వెయ్యి కి.మీ. మైలురాయిని చేరుకోనుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మతండా సమీపంలో ఈ ఘనతను సాధించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.