ప్రపంచమంతా కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే ఒమిక్రాన్ ఆందోళన ప్రారంభమయ్యింది. ఒమిక్రాన్ వేరియంట్ను ఈజీగా తీసుకోవద్దని, అది సీరియస్ ఫ్లూగా పరిణమించే అవకాశం ఉందని సీరం సంస్థ సీసీఈఓ అదర్ పూనావాలా హెచ్చరించారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనే టీకాను మోడెర్నా రూపొందించగా, దీని వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది.
కాగా, ఒమిక్రాన్ను ఎదుర్కొనే టీకాపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తామని అదర్ పూనావాలా వెల్లడించారు. రానున్న 6 నెలల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. కరోనా నియంత్రణకు కోవిషీల్డ్ టీకాను రూపొందించిన సీరం సంస్థ తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపై కార్యాచరణను ముమ్మరం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుతున్నట్లు కనిప్పిస్తున్నా పలు దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో వాటిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల అభివృద్ధి తప్పనిసరవుతోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్ను ఎదుర్కొనే టీకాపై ప్రయోగాలు సాగుతున్నాయని.. త్వరలోనే వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తామని పూనావాలా వెల్లడించారు.
కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు టీకాలు వేసుకున్నవారంతా బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. ఒమిక్రాన్పై పోరాడే వ్యాక్సిన్ కోసం నోవావాక్స్తో కలిసి పనిచేస్తున్నామని, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 5పై సమర్థంగా పోరాడే వ్యాక్సిన్ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అదర్ పూనావాలా చెప్పారు.
నోవావాక్స్ ప్రయోగాలు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయని, నవంబర్, డిసెంబర్ నాటికి అనుమతి కోసం అమెరికా నియంత్రణ సంస్థను సంప్రదించే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. త్వరలో ఒమిక్రాన్ పై పనిచేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బూస్టర్ డోస్గా ఆ టీకా అందిస్తే ఎంతో మేలని అదర్ పూనావాలా పేర్కొన్నారు.