ఆగస్టు 30న జరిగే వినాయక చవితి పండుగతో పాటు సెప్టెంబర్ 9న జరిగే గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలో ఉన్న 25 పాండ్స్కు అదనంగా మరో 50 పాండ్స్ను ప్రత్యేకంగా నిర్మిచ నున్నట్టు మంత్రి చెప్పారు.
భాగ్యనగర్ గణేశ్ సమితితోపాటు వివిధ వర్గాలతో సర్కార్ మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిపిన శాంతి సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ శ్రీలత, ఎంఎల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణరావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి రవిగుప్త, అదనపు డీజీపి జితెందర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నీతుకుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవి.ఆనంద్, మహేష్ బగవత్, స్టీఫెన్ రవింద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయకుమార్, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బగవంతరావు తదితరులు హజరయ్యారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా నగరంలో మట్టి గణపతులను పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోందని తలసాని తెలిపారు. జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఒక లక్ష, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో మరో లక్ష మొత్తం 6 లక్షల విగ్రహాలను పంపిణి చేయనున్నట్టు పేర్కొన్నారు.
నగంలో గణేశ్ ఉత్సవాలకు ఆటంకం కల్గిస్తే సహించే ప్రసక్తి లేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగ వంతరావు హెచ్చరించారు. శాంతి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, నిమజ్జనంపై అధికారులు కోర్టులో వ్యతిరేకంగా అఫిడవిట్లు దాఖలు చేశారని ఆరోపించారు. అధికారులు తమ పద్దతి మార్చుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని నగరంలో గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కేరళలో అయ్యప్ప ఉత్సవాలకు, తమిళనాడులో జల్లికట్టు ఉత్సవాలకు కోర్టులు ఆటంకం కల్పించినా అక్కడి ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను అనుగునంగా ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. ఉత్సవాలకు సహకరించేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.