ఉగ్రవాద ఆరోపణలపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69)ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం ఇస్లామాబాద్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పోలీసింగ్, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆయన వ్యాఖ్యలు ఆ వ్యవస్థలను బెదిరించేవిగా ఉన్నాయని పేర్కొంటూ పాక్ యాంటీ-టెర్రరిజం యాక్ట్ సెక్షన్ -7 ప్రకారం ఇస్లామాబాద్ మార్గల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదివారం పాక్ మంత్రి రానా సనావుల్లా మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని, ఆయనపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆ కొద్ది గంటలకే మాజీ ప్రధానిపై కేసు నమోదు అయ్యింది. ఖాన్ తన ప్రసంగంలో ‘‘అత్యున్నత పోలీసు అధికారులను, గౌరవనీయమైన మహిళా అదనపు సెషన్స్ జడ్జిని, పాక్ ఎన్నికల సంఘాన్ని భయభ్రాంతులకు గురిచేశారని, బెదిరించారని’’ మార్గల్లా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, పాక్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ స్థానిక ఛానెళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముందు నుంచి చెప్తున్నప్పటికీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే ప్రసంగాలను, ప్రకటనలను ప్రస్తారం చేస్తున్నాయని మందలించింది. అంతేకాదు కావాలంటే ఆలస్యంగా వాటిని ప్రసారం చేసుకోవచ్చని సూచించింది.
ఇదిలా ఉంటే, తనపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు కావడంపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ను బ్లాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు న్యాయవ్యవస్థ సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
మరోవైపు పీటీఐ సైతం నియంతల రాజ్యమంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ను అడ్డుకుని తీరతామని పేర్కొంటూ నిరసనలకు సిద్ధమైంది.
