రాయలసీమలో పెట్టుబడులు పెట్టనీయకుండా కొందరు నాయకులే అడ్డుకుంటున్నారని అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరోక్షంగా ధ్వజమెత్తారు. దేశం నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు.
“ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వారికి కప్పం కట్టాలట.. కప్పం కట్టకుంటే కియా పరిశ్రమపై చేసినట్లు దాడి చేస్తారట” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రానిదే రాయలసీమ అభివృద్ధి జరగదని చెబుతూ సీమ వెనకబడిదంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ యువత ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్కు వెళ్తున్నారని గుర్తు చేశారు.
దివ్యాంగులకు చేతనైనంతా సాయం చేయాలని ఉందని చెబుతూ వారికి చేయూత ఎలా అందించాలన్న దానిపై ఆలోచిస్తున్నామని తెలిపారు. విద్య, క్రీడా రంగాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక విధానం ఉండాలని సూచించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలకు మీరైనా పరిష్కారం చూపాలని కోరుతూ బాధితులు వినతులు అందజేస్తున్నారు.
జగన్ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి అమలులో ఘోరంగా వైఫల్యం అయ్యారని పవన్ ఆరోపించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఇంతవరకు లేదు. ఉద్యోగ కల్పన విషయంలో మాట తప్పారు. వాహనమిత్ర సాయం అందిస్తూనే. .చలాన్ల రూపంలో దోచుకుంటున్నారు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని లేని రాష్ట్రం ఏదంటే.. ఏపీ అనే చెప్పుకునే పరిస్థితి రావడం మనందరికీ సిగ్గుచేటని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైసీపీ వల్ల ఏపీకి హానికరం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తాం’ అని ప్రకటించారు. జనసేన పార్టీ నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామని చెబుతూ సెప్టెంబర్ నుంచి కార్యాచరణ మొదలుపెడతామని తెలిపారు.
పార్టీ నేతలు సోషల్మీడియా, ఇంటర్వ్యూలకే పరిమితం కావొద్దని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై సీరియస్గా పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారం చూడని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల్లో నేతలను గుర్తించి ప్రోత్సహిస్తామని పవన్ చెప్పారు. పార్టీ కోసం శ్రమించే వాళ్లను గుర్తుంచుకుంటామని హామీ ఇచ్చారురు.
‘‘వక్ఫ్బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు జనసేన పోరాడుతుంది. భవిష్యత్లో తీర్చలేని స్థాయిలో ప్రభుత్వం అప్పులు చేసింది. వైసీపీకి అధికారం దూరం చేయడమే మా విధానం’’ అని స్పష్టం చేశారు.