వివాదాస్పద వీడియోను విడుదల చేసి మంగళవారం అరెస్ట్ అయినా బీజేపీ శాసనసభ పార్టీ నేత రాజాసింగ్ ను ఒక వంక బీజేపీ సస్పెండ్ చేయడంతో పాటు, ఎందుకు పార్టీ నుండి బహిష్కరింప కూడదో సెప్టెంబర్ 2 లోగా వివరణ ఇవ్వాలని అంటూ షోకాజ్ నోటీసు జారీచేసింది. పార్టీ పదవుల నుండి కూడా తొలగించింది.
మరోవంక, రాజాసింగ్కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మొదటి బెయిల్ తిరస్కరించి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ఆయన న్యాయవాదుల వాదనలు విన్నతర్వాత కోర్ట్ తిరిగి బెయిల్ మంజూరు చేసింది.
రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. రాజాసింగ్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని అంటూ 41 సీఆర్పీసీపై ఆయన న్యాయవాదులు వాదించారు.
రాజాసింగ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు పోలీసులు అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించనందుకు రాజాసింగ్ రిమాండ్ను కోర్టు తిరస్కరిస్తూ, రాజాసింగ్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
తన సస్పెన్షన్ ను ముందే ఊహించిన రాజాసింగ్ ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడనని చెప్పారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే నుపూర్ శర్మలా తనను కూడా సస్పెండ్ చేయొచ్చునని తెలిపారు. తనను సస్పెండ్ చేసినా ప్రధాని మోదీ, అమిత్షాలకు అనుచరుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ కంటే ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు.
కాగా, నాంపల్లి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టినప్పుడు కోర్టు వద్దకు రాజాసింగ్ వ్యతిరేకవర్గం, అనుకూల వర్గం భారీగా చేరుకున్నారు. రాజాసింగ్కు వ్యతిరేక, అనుకూల నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టారంటూ ఐపీసీ సెక్షన్ 153(ఎ) కింద కేసు నమోదు చేశారు. అలాగే మత విశ్వాసాలను కించపర్చినందుకు సెక్షన్ 295-ఎ కింద కేసు.. ప్రకటనల ద్వారా నష్టం కలిగించినందుకు సెక్షన్ 295-ఎ బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ బెయిలబుల్ కేసులే నంటూ రాజాసింగ్ న్యాయవాది వాదించగా.. కోర్టు అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది.