బీజేపీనాయకురాలు, నటి సోనాలీ ఫోగట్ది హత్యేనని గోవా పోలీసులు తేల్చారు. ఆమె తాగిన డ్రింక్లో ప్రమాదకరమైన కెమికల్ను కలిపినట్లు వెల్లడించారు. సోనాలీతో పాటు వెళ్లిన వాళ్లే ఈ పనిచేశారని, డ్రింక్లో కెమికల్ కలపడం సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వివరించారు.
దీంతో సోనాలీ అసిస్టెంట్లు సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ సింగ్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆగస్టు 22న సోనాలీతో కలిసి గోవా టూర్కు వెళ్లినట్లు, అంజునా ఏరియాలోని కర్లీస్ రెస్టారెంట్లో దిగినట్లు వారు చెప్పారు. అదే రోజు రాత్రి రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నామని, సోనాలీ తాగిన డ్రింక్లో ప్రమాదకరమైన కెమికల్ను కలిపినట్లు వారు ఒప్పుకున్నారు.
సోనాలీ స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బాత్రూమ్కు తీసుకెళ్లినట్లు వివరించారు. ఉదయం ఆమెను హాస్పిటల్కు తరలించగా, గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా మొదట కేసు నమోదు చేసుకున్నారు.
అయితే, పోస్ట్మార్టం రిపోర్టులో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలడంతో హత్య కేసుగా మార్చారు. సుధీర్, సుఖ్వీందర్లను విచారించగా సోనాలీని చంపినట్లు ఒప్పుకున్నారని గోవా ఐజీపీ ఓంవీర్ సింగ్ తెలిపారు. ఆర్థిక కారణాలవల్లే హత్య చేసినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో హత్య కేసుకు తోడు డ్రగ్స్ కేసును కూడా నమోదు చేసిన పోలీసులు క్లబ్ యజమాని ఎడ్విన్ న్యూన్స్, డ్రగ్స్ డీలర్ దత్తాప్రసాద్ గావోంకర్లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం అరెస్టు చేసిన సోనాలీ సహాయకులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ సింగ్లను కోర్టు శనివారం పది రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది.
కాగా, సోనాలీ ఫోగట్ అంత్యక్రియలు శుక్రవారం సొంత రాష్ట్రమైన హర్యానాలో జరిగాయి. రిషి నగర్లోని శ్మశాన వాటికలో నిర్వహించిన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలతో పాటు బీజేపీ నాయకులు తరలివచ్చారు.