ప్రభుత్వ కార్యక్రమాలను ప్రసారం చేయడమే కాకుండా ఆకాశవాణి, దూరదర్శన్ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్. ఎల్.మురుగన్ సూచించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్ల సమీక్ష సమావేశాన్ని జమ్మూలో నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలను చేరుకోవడానికి రేడియో అత్యుత్తమ ప్రసార సాధనం గా ఉంటుందని చెప్పారు.
ఖాదీ వినియోగం ఎక్కువ చేయడానికి, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి ఉపకరించే కార్యక్రమాలను ప్రసారం చేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు.
జమ్మూ కాశ్మీర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, జమ్మూ కాశ్మీర్, లడఖ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విభాగాలు, వాటి ఫీల్డ్ యూనిట్లతో కలిసి నిర్వహిస్తున్న మీడియా కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలపై జమ్మూ కాశ్మీర్ ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు.
సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ప్రసారం అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని డాక్టర్ మురుగన్ విన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా మరింత ప్రచారం కల్పించాలని మీడియా యూనిట్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
జమ్మూ ఆకాశవాణి/దూరదర్శన్ క్లస్టర్ హెడ్ రాజేష్ కుమార్, జమ్మూ దూరదర్శన్ డైరెక్టర్ .రవి కుమార్, జమ్మూ కాశ్మీర్ , లడఖ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్త డైరెక్టర్ గులాం అబ్బాస్, పబ్లికేషన్ విభాగం జాయింట్ డైరెక్టర్ కుమారి నేహా జలాలి, జమ్మూ ఆకాశవాణి/దూరదర్శన్ న్యూస్ హెడ్ రమేష్ కుమార్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
జమ్మూలో ఉన్న బాగ్-ఈ బహు ఆక్వేరియంను డాక్టర్ మురుగన్ ఈ సందర్భంగా సందర్శించారు. మూడు రోజుల జమ్మూ పర్యటనలో ఉన్న డాక్టర్ మురుగన్ శ్రీ మాతా వైష్ణో దేవి, బావె వాలి మాతలను దర్శించి పూజలు చేశారు. రియాసీలో చేపల చెరువును దర్శించిన మంత్రి రైతులకు చేప విత్తనాలు అందించారు. లంపి స్కిన్ నిరోధానికి ఇస్తున్న టీకా కార్యక్రమాన్ని మంత్రి రియాసీ జ్యోతి పురం గోశాలలో ప్రారంభించారు.