తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 6 వ తేదీ ఉదయం 11.30 గం. లకు సమావేశాలు మొదలు కానున్నాయి. అటు శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.
అదేరోజు తెలంగాణ బీఏసీ సమావేశం కూడా జరగనుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు మార్చి 7న ప్రారంభమై మార్చి 15న ముగిసిన బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా ఉండనున్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు. సభను ప్రోరోగ్ చేయలేదు.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నెల మూడో తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అదే రోజు సాయంత్రం తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతోపాటు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టిఆర్ఎస్ అనుసరించనున్న పాత్రపై సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం బిజెపి శాసనసభా పక్షనేత రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం డిమాండ్ చేసింది. ఈ విషయంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బిజెపి తీరును రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన విషయం తెలింసిందే. ఈ ఘటనపై అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపక్షాలు ప్రశ్నించే అవకాశముంది.