ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసె’ అవార్డును కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తిరస్కరించారు. అవార్డు అందుకోవటంపై పార్టీతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అవార్డు కమిటీ నుంచి తనకు లేఖ అందిందని, ఆ గౌరవాన్ని వదులుకోవాలని పార్టీ సమష్టిగా నిర్ణయించినట్లు సీపీఎం నేత తెలిపారు.
కేరళ ఆరోగ్య శాఖ మంత్రిగా అందించిన సేవలకుగానూ, ముఖ్యంగా రాష్ట్రంలో నిఫా వైరస్, కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఆమె కృషికి గానూ.. 64వ మెగసెసె అవార్డుకు ఎంపిక చేసింది కమిటీ.
‘నేను సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యురాలిని. దీనిపై మా పార్టీ నాయకత్వంతో చర్చించాను. అవార్డును తీసుకోకూడదని అంతా కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. అది పెద్ద అవార్డు. అయితే, అది ఒక ఎన్జీఓ అందిస్తోంది. సాధారణంగా వారు కమ్యూనిస్టుల ప్రిన్సిపుల్స్ను వ్యతిరేకిస్తారు. నా పేరును పరిగణనలోకి తీసుకున్నందుకు నేను ఆ ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపాను. నా నిర్ణయాన్ని వారికి తెలియజేశాను.’ అని శైలజ వెల్లడించారు.
అయితే దీనిని మొత్తం రాష్ట్రానికి జరిగిన గౌరవాన్ని నిరాకరిస్తున్నట్లుగా చూడకూడదని ఆమె తెలిపారు. రాజకీయ నేతలకు గతంలో మెగసెసే అవార్డు ఇవ్వలేదని ఆమె గుర్తు చేశారు.