లండన్లో మాయమైన రూ.2.30 కోట్లు విలువ చేసే బెంట్లీ కారు పాకిస్థాన్ లో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. కొన్నివారాల క్రితం బెంట్లీ కారుని లండన్ నుండి కొందరు దుండగులు అపహరించారు. చివరకు ఆ కారు పాకిస్థాన్లోని ఓ సంపన్నుడి నివాసంలో కనిపించింది.
కారుని దొంగిలించిన దుండగులు దాన్ని ట్రాక్ చేసే వ్యవస్థను గుర్తించడంలో మాత్రం విఫలమయ్యారు. బెంట్లీ కారులో ఉండే అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థను ఆఫ్ చేయకపోవడంతో లండన్లోని నేర విభాగం వాహనం ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించగలిగింది. కరాచీలోని ‘కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్’కు సమాచారమిచ్చింది.
లండన్ నుండి వచ్చిన వివరాలతో పాక్ అధికారులు కరాచీలో సంపన్నులు నివాసం ఉండే డిహెచ్ఎ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఓ ఇంట్లో కారుని గుర్తించారు. అప్పటికే దాన్ని పాకిస్థాన్ రిజిస్ట్రేషన్ నెంబరును కూడా అమర్చారు. తర్వాత అది నకిలీదని తేలింది.
ఛాసిస్ నెంబరు మాత్రం లండన్ అధికారులు ఇచ్చిన సంఖ్యతో పోలి ఉండడం గుర్తించారు. యజమాని సరైన పత్రాలు కూడా చూపించలేకపోవడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కారు కొన్న వ్యక్తితో పాటు దాన్ని అమ్మిన మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఓ దౌత్యాధికారి పత్రాలు ఉపయోగించుకొని కారుని పాకిస్థాన్కు తరలించినట్లు విచారణలో తేలింది. అయితే ఈ కారుని అక్రమ మార్గంలో తరలించడం వల్ల దేశానికి చెల్లించాల్సిన రూ. 300 మిలియన్ల పన్నును కోల్పోయినట్లు పాక్ అధికారులు తెలిపారు.