కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంతో అర్భాటంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో ప్రవేశించడం, తమ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఏకంగా 18 రోజుల పాటు సాగబోవడం పట్ల సిపిఎం మండిపడుతున్నది. మరోవంక, దేశంలో అతిపెద్ద రాష్ట్రమే కాకుండా, బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కేవలం రెండు రోజులు మాత్రమే సాగేటట్లు షెడ్యూల్ ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశాన్ని సమైక్యపరిచేందుకు ఉద్దేశించినదా లేక కేరళలో కాంగ్రెస సీట్ల కోసం చేపట్టిన యాత్రా ? అని సిపిఎం సోమవారం ప్రశ్నించింది. ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఒక పోస్టర్ను ట్వీట్ చేసింది.
కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సైజుల్లో గల తేడాను పోలుస్తూ , వామపక్షం పాలించే కేరళలో ఏకంగా 18 రోజులు గడిపే కాంగ్రెస్, బిజెపి అధికారంలో వున్న యుపిలో కేవలం రెండు రోజులు కేటాయించడం విడ్డూరంగా వుందని పేర్కొంది. బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమిపై కాంగ్రెస్ పోరాడే తీరు చాలా వింతగా వుందని సిపిఎం ఎద్దేవా చేసింది.
ఆదివారం కేరళలోకి ప్రవేశించిన జోడో యాత్రకునేతృత్వం వహించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్టూన్తో గల పోస్టర్ను ట్విట్టర్ హ్యాండిల్ ప్రచురించింది. ఆ వెనువెంటనే కాంగ్రెస్ నేత జైరాం రమేష్ దీనిపై స్పందిస్తూ ‘చవకబారు (సిల్లీ) విమర్శ’లంటూ కొట్టిపారవేసారు.
ఇటువంటి అభిప్రాయాలకు రావడానికి ముందుగా కాస్తంత కసరత్తు చేసి మాట్లాడితే బాగుంటుందని సిపిఎంకు సూచించారు. ఈ యాత్రను ఎలా, ఎందుకు ప్లాన్ చేశామో తెలుసుకోవడానికి కాస్తంత కృషి చేయండి, ఇలాంటి వెర్రి మొర్రి విమర్శలు వద్దు అంటూ ఆయన ట్వీట్ చేశారు.