జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలు ఉన్నాయి. ఇందులో ఐవర్మెక్టిన్ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు. రనిటైడిన్ సహా 26 ఔషధాలను అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించారు.
ప్రముఖ యాంటాసిడ్ అయిన రనిటైడిన్ను తొలగించడంతో ఇకపై జిన్టాక్, రాంటాక్ వంటి ట్యాబ్లెట్లు అత్యవసర మందుల జాబితాలో ఉండవు. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉన్నట్లు చెప్పారు.
ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఎండోక్రైన్ మందులు, ఇన్సులిన్ గ్లార్గిన్, ఐవర్మెక్టిన్ వంటి 34 రకాల ఔషధాలను కొత్త జాబితాలో చేర్చారు.
రనిటైడిన్, సక్రాల్ఫేట్, అటినోలాల్ వంటి 26 రకాల ఔషధాలను తొలగించారు. 2015 తర్వాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను మళ్లీ ఈ సారే సవరించారు. 350 మందికి పైగా వైద్య నిపుణులతో 140 సార్లు చర్చలు జరిపి ఈ జాబితాను తయారు చేసినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
రనిటైడిన్ ఔషధాన్ని దేశంలో అసిలాక్, జిన్టాక్, రాంటాక్ వంటి బ్రాండ్లతో అమ్ముతున్నారు. ఎసిడిటీ, కడుపు నొప్పి సంబంధిత సమస్యలకు డాక్టర్లు ఈ మందులను ఎక్కువగా సూచిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే ఔషధాల్లో ఇది ఒకటి.
అయితే ఈ ఔషధంలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని 2019లో అమెరికా పరిశోధన ఒకటి వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఔషధ వినియోగంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగానే తాజాగా అత్యవసర ఔషధాల జాబితా నుంచి దీన్ని తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.