ఓటు బ్యాంకు రాజకీయాలు, రజాకార్ల భయంతో మిగిలిన రాజకీయ పార్టీలు ఇంకా తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని జరుపుకోకుండా వెనుకంజ చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ సర్దార్ పటేల్ లేకపోతే, హైదరాబాద్కు విముక్తికి చాలా ఏళ్లు పట్టేదని, నిజాం రజాకార్లను ఓడించనంత కాలం ‘అఖండ భారత్’ కల నెరవేరేది కాదని స్పష్టం చేశారు.
‘‘ఎన్నికల సమయంలో చాలా మంది విమోచన దినోత్సవం జరుపుకుంటామని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక రజాకార్ల భయంతో వెనుకంజవేశారు’’ అంటూ పరోక్షంగా కేసీఆర్ ను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హోం మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరినదని చెప్పారు. అయితే ఇతర పార్టీలు వివిధ పేర్లతో ఈ రోజును జరుపుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. .“వారైతే వేడుక జరుపుకుంటున్నారు, కానీ హైదరాబాద్ విమోచన దినోత్సవంగా కాదు, వారికి ఇంకా భయం ఉంది. నేను వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ గుండె నుండి భయాన్ని తొలగించండి” అంటూ చెప్పారు,
75 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినదని, రజాకార్లు ఈ దేశానికి సంబంధించిన నిర్ణయాలు ఇక తీసుకోలేరని హోం మంత్రి స్పష్టం చేశారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17, 1948న ‘ఆపరేషన్ పోలో’ అనే కోడ్నేమ్తో కూడిన పోలీసు చర్యతో భారత్ (యూనియన్ ఆఫ్ ఇండియా)లో విలీనం అయిందని తెలిపారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తదితరులు అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి అమిత్ షా నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు.