మయన్మార్లో అక్రమ నిర్బంధంలో బాధలు పడుతున్న దాదాపు 300 మంది భారతీయులను రక్షించేందుకు కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అభ్యర్థించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఆ 300 మంది భారతీయుల్లో దాదాపు 50 మంది తమిళులు ఉన్నారని వివరించారు.
ఐటి సంబంధ ఉద్యోగాల కోసం ప్రయివేట్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీల ద్వారా వీరంతా మొదట థాయ్లాండ్కు వెళ్లగా అక్కడ నుంచి వారిని బలవంతంగా మయన్మార్ తీసుకెళ్లి ఆన్లైన్లో అక్రమ ఉద్యోగాలు చేయిస్తున్నారని స్టాలిన్ లేఖలో తెలిపారు. ఈ అక్రమ ఉద్యోగాలకు తిరస్కరిస్తే ఆయా యాజమాన్యాలు భౌతిక దాడులకు దిగుతున్నారని అక్కడ నుంచి వార్తలు వస్తున్నాయని స్టాలిన్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
అక్కడ ఉన్న వారిలో 17 మంది తమిళులతో తాము ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని, వారు భారత ప్రభుత్వం త్వరగా జోక్యం చేసుకుని రక్షించాలని వారు కోరుతున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ సమస్యను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మయన్మార్ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేలా చొరవ తీసుకుని ఆదేశించాలని ప్రధానిని స్టాలిన్ కోరారు.