అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్, ఆ అరెస్ట్ ను నిరసిస్తూ నిరసనకు దిగిన జర్నలిస్టులు వంశీ కృష్ణ, కృష్ణాంజనేయులు తదితరులను అరెస్ట్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని ప్రశ్నించిన పవన్ ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతగా రియాక్ట్ అయ్యిందంటే అందులో ఏదో మతలబు దాగుందని స్పష్టం చేశారు. అరెస్టు, కుట్రపూరిత నేరం కింద సెక్షన్ల నమోదు చూస్తుంటే..జగన్ ప్రభుత్వం ఉలిక్కిపడుతుందని అనిపిస్తోందని తెలిపారు.
అసలు అంకబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనే లేదని కూడా పవన్ ఆరోపించారు. సింగిల్ పోస్టును షేర్ చేస్తేనే అంకబాబును అరెస్ట్ చేసిన పోలీసులు నేతలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన కామెంట్లు పోస్ట్ చేస్తున్న వైసీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు.
హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా పోస్టులు పెట్టిన కేసును సీఐడీ అధికారులు ఏ రీతిన దర్యాప్తు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందని ధ్వజమెత్తారు. ఈ కేసులో ఇప్పటికీ ఇంకా కొందరిని అరెస్టే చేయలేదని కూడా పవన్ గుర్తు చేశారు.
ఇలా ఉండగా, తన భర్తకు సమాచారం ఇవ్వకుండా సీఐడీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అంకబాబు సతీమణి విజయ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.
తన భర్తను వెంటనే విడుదల చేయాలని, బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. జర్నలిస్ట్ అంకబాబును విజయవాడలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు.
అంకబాబు అరెస్ట్ అక్రమమని, వెంటనే విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు. 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ను వాట్సాప్ పోస్ట్ కారణంగా అరెస్ట్ చేయడం అక్రమమని, దారుణమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని విమర్శిస్తూ అనారోగ్య సమస్యలతో ఉన్న అంకబాబును వెంటనే విడుదల చేయాలని డిజిపికి రాసిన లేఖలో ఆయన కోరారు.