ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ భారత్ సహా అన్ని పొరుగుదేశాల తోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని చెప్పడం పట్ల భారత్ విస్మయం వ్యక్తం చేసింది. ఢిల్లీ, పొరుగు దేశాలతో శాంతిని కోరుకునే వారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించదని స్పష్టం చేసింది.
షరీఫ్ ప్రసంగంకు భారత శాశ్వత బృందం తొలి సెక్రటరీ వినిటోధీటుగా సమాధానం ఇస్తూ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ శాంతిని కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడ్డారు.
“భారత్పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్కు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు” అంటూ విమర్శించారు.
“పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబైలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు. అన్యాయంగా అక్రమంగా పొరుగు దేశాల భూ భాగాలను లాక్కోవాలని చూడరు” అని వినిటో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు.
పాకిస్థాన్ లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్లు అంశాన్ని ప్రస్తావిస్తూ మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసి పోయినప్పుడే సాధ్యమౌతుందని ఆయన స్పష్టం చేశారు.