బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్ కు అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గాను ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశేష సేవలకు గాను ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. బాలనటిగా సినీరంగానికి ఎంట్రీ ఇచ్చిన ఆశా పరేఖ్ తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. తీస్రీ మంజిల్, కటి పతంగ్, ప్యార్ కా మౌసమ్, దో బదన్, చిరాగ్ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు పొందారు.
అంతేకాకుండా.. మాతృభాష అయిన గుజరాతీతోపాటు పంజాబీ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. అనంతరం 1992లో ఈ నటిని భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది. కాగా.. 79 ఏళ్ల ఈ నటి పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే మిగిలిపోయింది.
ఈ అవార్డు ప్రకటించిన తర్వాత కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఆశా పరేఖ్కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆమె దాదాపు 95 చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. 1998-2001 మధ్య సీబీఎఫ్సీ ఛైర్పర్సన్గా ఉన్నారు. ఈ అవార్డును సెప్టెంబర్ 30న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అందజేస్తాం’ అని చెప్పుకొచ్చారు.
ఉదిత్ నారాయణ్, హేమా మాలిని, ఆశా భోంస్లే, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆశా పరేఖ్ పేరుకి ఈ అవార్డుని ఇవ్వాలని నిర్ణయించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. గతంలో రాజ్ కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, ఏఎన్నార్, వినోద్ ఖన్నా తదితరులు అందుకున్నారు. దేవికా రాణి మొదటి విజేత కాగా, రజనీకాంత్కు గతేడాది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రధానం చేశారు.