కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఉచిత రేషన్ పథకం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత గడువు సెప్టెంబరు 30తో ముగియనుండటంతో మరో మూడు నెలల పాటు ఉచిత రేషన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణం, రాబోయే పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని పొడిగించాలని మోడీ సర్కారు నిర్ణయించింది.
దీంతో కేంద్ర ఖజానాపై మరో రూ. 44,700 కోట్ల మేర అదనపు భారం పడనుందని కేంద్రం తెలిపింది. డిసెంబరు 31 వరకు ఈ ఉచిత రేషన్ను కొనసాగించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్రం 2020 ఏప్రిల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పథకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఆ తర్వాత మహమ్మారి రెండో దశ విజృంభణ నేపథ్యంలో పథకాన్ని పలుమార్లు పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి నెలకు రూ. 5 కిలో వంతున కేంద్రం ప్రతినెలా ఉచిత రేషన్ అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటివరకు రూ 3.4 లక్షల కోట్లు ఖర్చు చేసింది.