రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న డొనెట్క్స్, లుహాన్స్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందాలపై ఆయన సంతకం చేశారు.
మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆ నాలుగు రీజియన్లకు సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చలకు రావాలని ఉక్రెయిన్ను ఆహ్వానించిన ఆయన.. విలీన ప్రాంతాలను మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాలను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు.
బాల్టిక్ సముద్రం కింద రష్యా నిర్మించిన గ్యాస్ పైప్లైన్లను పశ్చిమ దేశాలు ధ్వంసం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాలో నాలుగు రీజియన్ల విలీనానికి సంబంధించిన ఒప్పందాలను ఆమోదించేందుకు రష్యా ఉభయ సభలు వచ్చే వారం సమావేశం కానున్నాయి.
తాజా పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి కలుపుకుంటామని మరోసారి ప్రతిజ్ఞ చేశారు. నాటో సభ్యత్వ మంజూరును వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు నాటో సైనిక కూటమిలో చేరేందుకు ‘వేగవంతమైన’ దరఖాస్తును సమర్పిస్తున్నట్టు శుక్రవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.
కాగా, పుతిన్ ప్రకటనపై పశ్చిమ దేశాలు కూడా తీవ్రంగా స్పందించాయి. రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని, చట్టవిరుద్ధ రెఫరెండంలను, విలీన ప్రక్రియలను తాము గుర్తించబోమని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్ భూభాగాల విలీనం నేపథ్యంలో రష్యాకు చెందిన వెయ్యి మంది వ్యక్తులతో పాటు పలు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో రష్యా సెంట్రల్ బ్యాంకు గవర్నర్, రష్యా జాతీయ భద్రతా మండలి సభ్యుల కుటుంబాలు ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై రష్యా బలగాలు క్షిపణులు, రాకెట్లు, డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. జపోరిజియా ప్రాంతంలో పౌరులకు సంబంధించిన వాహన కాన్వాయ్పై జరిపిన దాడిలో 25 మంది మరణించగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి.
తమ బంధువులను తీసుకొచ్చేందుకు రష్యా ఆక్రమిత జపోరిజియా ప్రాంతాలోకి పౌరులు వెళ్తున్న సమయంలో.. వారిని లక్ష్యంగా చేసుకొని రష్యా బాంబుల వర్షం కురిపించిందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధికారి కైరిలో టిమోషెంకో పేర్కొన్నారు. డినిప్రో నగరంలో రష్యా బలగాల దాడిలో ఒకరు మరణించారని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. ఉక్రెయిన్ దక్షిణ నగరాలైన మైకోలైవ్, ఒడెసా నగరాలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకున్నదని ఉక్రెయిన్ సైన్యం పేర్కొన్నది.