ఆసరా పింఛన్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా కోతపెడుతోందని, వివిధ కారణాలను చూపుతూ పింఛన్ పొందేందుకు అనర్హులంటూ ఫించన్ పంపిణీ ఆపేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ పేద ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. ఆసరా పింఛన్లు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని మళ్లీ తీసేస్తున్నరని ఆమె మండిపడ్డారు.
అప్లికేషన్లు తీసుకున్న మూడున్నరేండ్ల తర్వాత ఇటీవల పింఛన్లు శాంక్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులకే అనర్హులున్నారని కట్ చేస్తుండడంతో ఏం చేయాలో లబ్ధిదారులకు తెలియక అధికారుల చుట్టూ తిరుగుతున్నరని ఆమె తెలిపారు.
మూడెకరాల భూమి, సొంత కారు ఉన్న వారి వివరాలను సీసీఎల్ఏ, ఆర్టీఏ ఆఫీసుల నుంచి తీసుకున్న అధికారులు ఏరివేత ప్రక్రియ చేపట్టారు. అయితే క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా తొలగిస్తుండడంతో అర్హులైన వారు కూడా పింఛన్లు కోల్పోతున్నరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లాలో గతంలో మొత్తం 1,23,006 మంది ‘ఆసరా’ లబ్ధిదారులున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికుల పింఛన్లకు చెందిన 13,761 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నయి. దానికి తోడు పింఛన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు ప్రభుత్వం తగ్గించడంతో కొత్తగా 26,704 మంది అప్లై చేసుకున్నారు.
అయితే, ఈ లెక్కన జూన్ నుంచి కొత్త పింఛన్లు శాంక్షన్ చేసిన ప్రభుత్వం 34,882 మంది అర్హులను మాత్రమే గుర్తించి కార్డులను జారీ చేసిందని విజయశాంతి విస్మయం వ్యక్తం చేశారు. తాజాగా వెరిఫికేషన్ పేరుతో 1,400 మంది పింఛన్లను తొలగించారని ఆమె ధ్వజమెత్తారు. ఈ ప్రక్రియ కూడా సజావుగా జరగలేదని ఆమె విమర్శించారు.
అధికారులు కూడా ఎక్కడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన దాఖలాలు లేవని అంటూ ఏం కేసీఆర్… పేదల బతుకులతో ఇలాగేనా ఆడుకునేది? అని ఆమె ప్రశ్నించారు. ఈ పేదలు నీకు త్వరలోనే తగిన జవాబు చెబుతారని ఆమె హెచ్చరించారు.