లైంగిక వేధింపుల ఆరోపణలపై సినీ నిర్మాత సాజిద్ఖాన్ను బిగ్బాస్ నుంచి తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. అయితే, అప్పటి నుంచి రేప్ చేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.
సాజిద్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి బెదిరింపులకు దిగుతూ తమను తమ పని చేయకుండా ఆపాలనుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాలంటూ ఆమె ట్వీట్ చేశారు.
మీటూ ఉద్యమం సందర్భంగా పది మంది మహిళలు సాజిద్ ఖాన్పై లైంగిక వేధింపుల ఆరోపణలను గతంలో చేశారు. ఈ క్రమంలోనే సాజాద్ ఖాన్పై వచ్చిన ఫిర్యాదులు, అతని అసహ్యకరమైన మనస్తత్వాన్ని చూపుతుందని, తప్పుడు వ్యక్తికి బిగ్బాస్లో చోటు కల్పించారని పేర్కొంటూ అతన్ని షో నుంచి తొలగించాలని కోరుతూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాసినట్లు ఆమె ట్వీట్ చేశారు.
బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎదుట స్వాతి మలివాల్ ఫిర్యాదు ఇచ్చింది. ‘‘సాజిద్ ఖాన్ తమను లైంగికంగా వేధించాడని అనేక మంది హీరోయిన్స్, మోడల్స్, జర్నలిస్ట్స్ మీ టూ మూవ్మెంట్లో ఆరోపించారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ సినిమాలకు దర్శకత్వం వహించకుండా ఒక్క ఏడాది పాటు అతడిపై నిషేధం విధించింది” అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
“అతడు అవకాశాలిప్పిస్తామని అనేక మందిని లైంగికంగా వేధించాడు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళలకు అసభ్యకరమైన సందేశాలను పంపించాడు. తమ జీవితాలను ఫణంగా పెట్టి అతడు చేసిన దురాగతాల గురించి కొంత మంది బయటికి వచ్చి చెప్పారు’’ అని స్వాతి మలివాల్ ఆ ఫిర్యాదులో పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఈ అక్టోబర్ 1న బిగ్బాస్-16 సీజన్ ప్రారంభం కాగా, షోలో చిత్ర నిర్మాత సాజిద్ ఖాన్ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2018లో సాజిద్ ప్రాజెక్టుల్లో పని చేసిన పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సలోని చోప్రా, షెర్లిన్ చోప్రా, అహానా కుమ్రా, మందన కరీమి తదితర నటీమణులు ఈ జాబితాలో ఉన్నారు.