మైడెన్ ఫార్మాస్యూటికల్స్కి హర్యానా ఫుడ్ అండ్ డ్రగ్ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు తయారీ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. అలాగే నవంబర్ 14 నాటికల్లా షోకాజ్ నోటీసులకు సమాధానమివ్వాలని ఆదేశించారు.
దగ్గు, జలుబు నివారణకు సిరప్లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. హర్యానాలోని సొనెపట్ కేంద్రంగా మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ధ్వజమెత్తింది.
పలువురు చిన్నారుల్లో కిడ్నీలు దెబ్బతినడానికీ ఇవే కారణమని తెలిపింది. ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్లుగా వీటిని పేర్కొంది. ఈ మందుల సరఫరా, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.
సోనెపట్లోని సిరప్ తయారీ కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఆ సంస్థ 12 నిబంధనలను ఉల్లంఘించినట్లు వెల్లడైనదని అధికారులు తెలిపారు. దగ్గు మందు తయారీ, టెస్టింగ్కు సంబంధించిన పరికరాల లాగ్బుక్లను నిర్వహించడంలో విఫలమైందని, ప్రొపైలిన్ గ్లైకాల్, సార్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్పరాబెన్ బ్యాచ్ నంబర్ల వివరాలు లేవంటూ పలు ఉల్లంఘనలను గుర్తించింది.
తయారీ ప్రక్రియలో పరీక్షలకు సంబంధించిన వివరాలూ ఇవ్వనట్లు తేలింది. ఈ మందులు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గతంలోనే నాలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 2011లో ఈ కంపెనీపై వియత్నాం నిషేధం విధించింది. ఈ సిరప్లను ప్రయోగశాలల్లో పరీక్షించగా… ప్రమాదకర స్థాయుల్లో డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు పేర్కొంది.
సందేహాస్పదమైన సిరప్ తయారీ ప్రక్రియ, పద్ధతిని ధృవీకరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ ఔషధాలను పరీక్ష నిమిత్తం కోల్కతాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్కు పంపించాం. ఆ ఫలితాలు ఇంకా రాలేదు’ అని అధికారులు తెలిపారు.
కాగా, 66 మంది పిల్లల మరణాలకు భారత్లో తయారైన నాలుగు దగ్గు మందులే కారణమని డబ్ల్యూహెచ్వో ఇచ్చిన నివేదికలను పరిశీలించేందుకు బుధవారం ప్రభుత్వం నలుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మైడెన్ ఫార్మాసుటికల్స్ సంస్థకు చెందిన సోనిపట్ యూనిట్లో తయారు చేసిన మందులే పిల్లల మరణానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ సెప్టెంబరు 29న కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎ్ససీవో)కు తెలిపింది. హరియాణా ప్రభుత్వం ఆ యూనిట్లో డ్రగ్స్ తయారీ నిలిపివేయాలని బుధవారం ఆదేశించింది.