మొబైల్ యాప్ ద్వారా పెట్టుబడులు అంటూ రూ. 903 కోట్ల మేరకు మోసానికి సంబంధించిన బండారాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బయటపెట్టారు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి మొబైల్ యాప్స్ ద్వారా పెట్టుబడులు సేకరించి మోసానికి పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సి.వి.ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీకి చెందిన నవనీత్ కౌశిక్ తాను ఆర్బీఐ లైసెన్సులు పొందిన రంజన్ మనీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ అనే మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీల ద్వారా రూ.903 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు.
రంజన్ మనీ కార్పొరేషన్ ద్వారా 7 నెలల్లోనే రూ.441 కోట్లను, కేడీఎస్ ద్వారా 38 రోజుల్లోనే రూ.462 కోట్లను డాలర్లుగా మార్చి విదేశాలకు పంపారని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ రెండు మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీలు ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపారు.
ఈ పెట్టుబడుల మోసానికి సంబంధించిన ముఠాను నడిపిస్తున్న ముగ్గురు సూత్రధారుల్లో ఇద్దరు చైనాలో ఉన్నారని సీవీ ఆనంద్ చెప్పారు. మరో సూత్రధారి తైవాన్ కు చెందిన చూ చున్ యు ముంబైలో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఢిల్లీలో ఉండే సాహిల్, సన్ని దుబాయ్ లో ఉండే వరుణ్ అరోరా, భూపేశ్ అరోరా ద్వారా ఇండియాలో జరిగే ఈ మోసం వ్యవహారాలను చూ చున్ యు పర్యవేక్షించేవాడని గుర్తించారు.
ఈ కేసులో ఇద్దరు చైనీస్ తో పాటు మొత్తం 10 మంది అరెస్టు చేశామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడుల మోసం ఫ్రాడ్ జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. కంబోడియా కేంద్రంగా ఈ స్కాం నడుస్తోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
అధిక వడ్డీ ఆశతో మొబైల్ యాప్స్ ద్వారా ప్రజలు పెట్టే పెట్టుబడి మొత్తాన్ని 38 వర్చువల్ అకౌంట్ల ద్వారా మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీలకు పంపేవారు. అక్కడ వాటిని డాలర్లుగా మార్చి విదేశాల్లోని అకౌంట్లకు పంపేవారు.
హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఇక్కడ రెండు వర్చువల్ అకౌంట్స్ ఓపెన్ చేసి చైనీస్ కి హెల్ప్ చేస్తున్నారని సీవీ ఆనంద్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ డిఆర్ఐ, ఈడీ విభాగాలను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి మరింత లోతుగా విచారణ చేస్తామని చెప్పారు.