కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. హిజాబ్ పై ధర్మాసనం భిన్న అభిప్రాయాలతో తీర్పు నిచ్చింది. ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు.
విద్యార్థినుల చదువుకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చూస్తూ జస్టిస్ సుధాన్షు ధులియా తీర్పునిచ్చారు. జస్టిస్ హేమంత్ గుప్తా కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ అంశాన్ని సిజెఐ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.
‘హిజాబ్ అనేది వారి ఎంపికకు సంబంధించినది. కానీ దీనికంటే ఉన్నతమైనది ఆడపిల్లల చదువు అని నా అభిప్రాయం అన్నారు. దీంతో తుది తీర్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా వెల్లడించారు.
కర్నాటక హిజాబ్ వివాదాన్ని ఇప్పుడు మరింత విస్తృత ధర్మాసనం విచారించనున్నది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఈ కేసును సీజేఐ ముందుకు తీసుకువెళ్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక హిజాబ్ వివాదంపై జస్టిస్ గుప్తా స్పందిస్తూ మొత్తం 11 ప్రశ్నలను లేవనెత్తారు.
ఇస్లాం ప్రకారం హిజాబ్ను ధరించడం మతపరంగా అత్యవసరం ఏమీ కాదు అని, ప్రభుత్వ ఆదేశాలు సరిగ్గానే ఉన్నట్లు జస్టిస్ గుప్తా తెలిపారు. ఆ కారణాల చేత అప్పీల్ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నాటక హైకోర్టు ఈ కేసులో తప్పుడు విధానంలో వెళ్లినట్లు జస్టిస్ దులియా తెలిపారు.
ప్రస్తుతం కేసు ఇంకా పెండింగ్లో ఉన్నందున పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్పై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువడినా.. దాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే, తాము మెరుగైన తీర్పును ఆశిస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు హిజాబ్, బురఖా వద్దని డిమాండ్ చేస్తున్నారన్నారు.