“భారతదేశంలో ప్రమాదవశాత్తు మరణాలు, ఆత్మహత్యలు 2021” పెడుతూ జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్ సి ఆర్ బి) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021లో దేశంలో రోజుకు 15 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలు కూడా రోజుకు 15 మంది చొప్పున బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి గత ఏడాది మొత్తం 10,881 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 5,318 మంది రైతులు, 5,563 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. దేశంలో చోటుచేసుకున్న మొత్తం ఆత్మహత్యల్లో రైతు ఆత్మహత్యలు 6.6 శాతం.
ఎందుకంటే 2021లో దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్య చేసుకోగా, వారిలో 10,881 మంది రైతులే. ఇక ఆత్మహత్య చేసుకున్న 5,318 మంది రైతుల్లో 211 మంది మహిళలు, 512 మంది కౌలు రైతులు ఉన్నారు.
రైతుల ఆత్మహత్యలు 2017 నుంచి మరింత పెరిగాయి. 2017 నుంచి 2021 వరకు నాలుగేండ్ల వ్యవధిలో వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం 53,000 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 28,600 మంది రైతులే ఉన్నారు.
ఇక వ్యవసాయ రంగంలోని వారి ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ వ్యవసాయ రంగంలో 4,064 ఆత్మహత్యలు చోటుచేసుకోగా అందులో 2,640 మంది రైతులున్నారు. ఆ 2,640 మందిలో 211 మంది కౌలు రైతులు. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి.