సిత్రాంగ్ తుఫాను ధాటికి బంగ్లాదేశ్ అతలాకుతలమయింది. బెంగాల్ తీరం సమీపంలో బంగ్లాదేశ్లోని బైరిసాల్ వద్ద తీరందాటింది. దీనిప్రభావంతో దేశంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. తుఫాను కారణంగా 35 మంది మృతిచెందారు. సుమారు 10 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు.
తుఫాను ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవండంతో 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు చీకట్లలోనే మగ్గుతున్నారని, 15 ఎకరాల్లో పంట నాశనమయిందని ప్రభుత్వం వెల్లడించింది. వేల సంఖ్యలో ఫిషింగ్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని తెలిపింది. విమాన రాకపోకలు నిలిచిపోయాయని, వరదల వల్ల రోడ్లు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని పేర్కొన్నది.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని 2.19 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 6925 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేశామని వెల్లడించింది. కాగా, తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని కొన్ని జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే తుఫాను అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
. సోమవారం రాత్రి సైక్లోన్ సిత్రంగ్ తీరం దాటిందని ఆఫీసర్లు తెలిపారు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో సంభవించే హరికేన్లు, టైఫూన్లతో సమానంగా సిత్రంగ్ ప్రభావం చూపిందని వెల్లడించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి మిలియన్ మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.
‘‘చాలాచోట్ల చెట్లు మీద పడి 14 మంది చనిపోయారు. జమునా నదిలో ప్రతికూల వాతావరణం కారణంగా పడవ మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్తినష్టానికి సంబంధించి రిపోర్టు రావాల్సి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సైక్లోన్ షెల్టర్లకు తరలించాం. సోమవారం రాత్రంతా వారు ఆ షెల్టర్లలోనే గడిపారు. మంగళవారం వారు తమ ఇళ్లకు వెళ్లిపోయారు” అని విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ సెక్రటరీ కమ్రుల్ తెలిపారు.
ఢాకా, ఖుల్నా, బరిసాల్లో సిత్రంగ్ ప్రభావం ఎక్కువగా కనిపించిందని, ఈ ప్రాంతాల్లో 32.4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఆయన వివరించారు. దక్షిణ దీవిలోని మహేష్ కాలీలో తుఫాను ధాటికి చెట్లు నేలకూలాయి. రాత్రంతా భీకర గాలులు స్థానికులను వణికించాయి.
‘‘గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మేము నిద్ర పోలేకపోయాం. మా ఇండ్లు ఎక్కడ డ్యామేజ్ అవుతాయేనని భయపడ్డాం. వర్షాలకు చాలా ఇండ్లలో పాములు వచ్చాయి. ఇండ్లు మునిగిపోయాయి” అని స్థానికులు తెలిపారు. కాగా సిత్రంగ్ సైక్లోన్ను దృష్టిలో పెట్టుకొని పొరుగున ఉన్న వెస్ట్ బెంగాల్లోనూ వేలమందిని వంద రిలీఫ్ సెంటర్లకు తరలించామని భారత అధికారులు తెలిపారు.