ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టి) దక్షిణాది క్యాంపస్ ఏర్పాటుతో ట్రేడ్ హబ్గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ జెఎన్టియు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్టి క్యాంపస్ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అపారమైన ఎగుమతి సామర్థ్యాలతో ప్రాముఖ్యత చాటుతూ విదేశీ వాణిజ్యానికి హబ్గా నిలుస్తున్న కాకినాడలో ఐఐఎఫ్టి ఏర్పాటు ఎంతో సముచితమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపిలో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐఎస్ఇఆర్, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి తదితర పది ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ అమెరికా డాలర్లుగా ఉందని, వచ్చే 25 ఏళ్లలో దీనిని పది రెట్లు పెంచేలా కృషి చేస్తే వందేళ్ల స్వతంత్ర భారత్ ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.
రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఐఐఎఫ్టి క్యాంపస్ శాశ్వత భవనాల కోసం కాకినాడ సెజ్లో రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. ఎంపిలు వంగా గీత, భరత్రామ్, జివిఎల్.నరసింహరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలాక్కియా పాల్గొన్నారు.