ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో చిట్టచివరకు విజయం కైవసం చేసుకున్నప్పటికీ అధికార టిఆర్ఎస్ వర్గాలు మాత్రం వచ్చిన 10 వెల పైచిలుకు ఆధిక్యత మాత్రం సంతృప్తి కలిగించడం లేదు. సుమారు 20 వేల మెజారిటీ వస్తుందని వేసుకున్న అంచనాలు తలకిందులు కావడంతో ఆత్మవలోకనంలో పడ్డారు.
మెజారిటీ తగ్గడానికి ప్రధాన కారణం తమ ఎన్నికల గుర్తు కారును పోలిన పలు ఇతర గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంగా భావిస్తున్నారు. ఆయా గుర్తులను స్తంభింప చేయాలనీ రిటర్నింగ్ అధికారిని ముందే కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇటువంటి గుర్తులకు సుమారు 6,000 ఓట్లు పడడంతో అవన్నీ తమ ఓట్లే అని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
కారుగుర్తును పోలిన రోడ్డురోలర్, చపాతిరోలర్ గుర్తులు ప్రమాదకరంగా మారాయి. అభ్యర్థులెవరో తెలియకపోయినా వారికి పెద్ద మొత్తంలో ఓట్లు వచ్చాయి. ఈవిఎం 12వ నెంబర్లో ఉన్న మారమోని శ్రీశైలంయాదవ్ చపాతిరోలర్కు 2407 ఓట్లు, 14వ సంఖ్యలోని కె.శివకుమార్ రోడ్డురోలర్ గుర్తుకు 1874 ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మూడు ఈవీఎంలను ఉపయోగించారు. ఇది కూడా టీఆర్ఎస్కు శాపంగా మారింది. రెండో ఈవీఎంలోని రెండో సంఖ్యలో ఉన్న ఏర్పుల గాలయ్య చెప్పుల గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి.
మొదటి ఈవిఎంలో రెండవసంఖ్యలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కారు గుర్తు ఉండటంతోనే అలా జరిగింది. ఇవన్నీ టీఆర్ఎస్ గుర్తుకు పడాల్సినవే కానీ నిరక్షరాస్యులు, వృద్ధులకు తెలియక వేయడంతో టీఆర్ఎస్ మెజార్టీ తగ్గింది. టీఆర్ఎస్కు మెజార్టీ తగ్గడానికి ఈకారణాలేనని టిఆర్ఎస్ నేతలు చెపుతున్నారు.