భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సోమవారం అత్యున్నత పదవి నుంచి పదవీ విరమణ చేశారు. వాస్తవానికి జస్టిస్ లలిత్ మంగళవారం (ఈ నెల 8న) వరకూ పదవిలో కొనసాగే వీలుంది. అయితే.. మంగళవారం గురు నానక్ జయంతిని పురస్కరించుకుని సెలవు రావడంతో ఆయన సోమవారమే పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 74 రోజుల పాటు విధుల్లో కొనసాగారు.
న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన 37 ఏండ్ల ప్రయాణం చాలా సంతృప్తినిచ్చిందని సీజేఐ జస్టిస్ లలిత్ తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా సోమవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో లాయర్గా తన తొలి కేసును జస్టిస్ వైవీ చంద్రచూడ్ బెంచ్ ముందు వాదించానని, ఇప్పుడు ఆయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్కు సీజేఐగా బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 27న 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లలిత్ 74 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. తాజాగా 103వ రాజ్యాంగ సవరణపై మెజార్టీ తీర్పును వ్యతిరేకిస్తూ జస్టిస్ యూయూ లలిత్ మైనార్టీ తీర్పు వెలువరించారు. ఇది ఆయన ఇచ్చిన చివరి తీర్పుల్లో ఒకటి కావడం విశేషం. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ నెల 9న ప్రమాణం చేయనున్నారు.