ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి విద్య, ఉపాధి కల్పనలో 10 శాతం రిజర్వేషన్ కల్పించే 103వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు కాకుండా 3:2 నిష్పత్తిలో మెజారిటీ తీర్పును వెలువరించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఆ సవరణ ఉల్లంఘించడం లేదని అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయమై దాఖలైన మొత్తం 40 పిటిషన్లపై సోమవారం నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించింది. ధర్మాసనంలోని జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ జేబీ పార్దీవాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు అనుకూలంగా తీర్పు చెప్పగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్తో పాటుగా జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఆ రిజర్వేషన్ను తిరస్కరిస్తూ మైనారిటీ తీర్పు వెలువరించారు.
35 నిమిషాల వ్యవధిలో న్యాయమూర్తులు నాలుగు తీర్పులను కోర్టులో చదివి వినిపించారు. 2019లో తెచ్చిన ఆ సవరణ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్ మహేశ్వరి తన తీర్పులో పేర్కొన్నారు. నిస్సహాయ వర్గం లేదా తరగతి సమానత్వ సమాజం దిశగా అడుగులు వేసేందుకు చేపట్టిన సమ్మిళిత తత్వంతో కూడిన నిర్ణయాత్మక చర్యగా ఆ రిజర్వేషన్ను చూడాలని తెలిపారు.
వివక్షతో కూడుకొని ఉందన్న కారణంగా 103వ సవరణను కొట్టివేయలేమని జస్టిస్ త్రివేది అభిప్రాయపడ్డారు. ఆర్థిక బలహీన వర్గాల కోసం పార్లమెంటు చేపట్టిన నిర్ణయాత్మక చర్యగానే దానిని చూడాలని నొక్కిచెప్పారు. ఆ ఇద్దరితో జస్టిస్ జేబీ పార్దీవాలా ఏకీభవించారు. సవరణ చెల్లుతుందని తెలిపారు. అయితే రిజర్వేషన్ అనేది సామాజికన్యాయ సాధనకు ఉద్దేశించిందని, దానిని నిరవధికంగా కొనసాగిస్తే స్వార్థపర అంశంగా మారుతుందని హెచ్చరించారు.
న్యాయమూర్తి రవీంద్రభట్ మెజారిటీతో విభేదించి మైనారిటీ తీర్పు వెలువరించారు. ఈడబ్ల్యూఎస్ కోటా సవరణను కొట్టివేశారు. ఆ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని అది ఉల్లంఘిస్తున్నదని అభిప్రాయపడ్డారు. జస్టిస్ భట్ అభిప్రాయంతో సీజేఐ జస్టిస్ లలిత్ ఏకీభవించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సోమవారమే పదవీ విరమణ చేసి ఆయన వెలువరించిన తుది తీర్పుల్లో ఇదొకటి కావడం విశేషం.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ 50% పరిమితికి ఎగువన ఈ కొత్త ఈ డబ్ల్యూఎస్ కోటాను ప్రవేశపెట్టారు. 103వ రాజ్యాంగ సవరణను సమర్థించిన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి 50 శాతం పరిమితి అనేది దాటడానికి వీల్లేని గీత ఏమీ కాదని అన్నారు. సదరు పరిమితిని దాటడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఏరకంగానూ ఉల్లంఘించడం కిందకు రాదని పేర్కొన్నారు.
ఆర్థిక ప్రాతిపదిక, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి మినహాయించడం, 50% పరిమితి అనుల్లంఘనీయం అన్న మూడు అంశాలపై ప్రధానంగా నిర్ణయం జరిగిందని తెలిపారు. ఈ మూడింటిలో ఏదీ రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది.
50% పరిమితి అనేది దాటకూడని నియమం ఏమీ కాదని అభిప్రాయపడింది. ఆ పరిమితి పవిత్రమైందన్న వాదనలను తోసిపుచ్చింది. 50% పరిమితి అనేది 15(4), 15(5), 16(4) రాజ్యాంగ అధికరణాల పరిధిలోని రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుందని నొక్కిచెప్పింది. జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పార్దీవాలాలిద్దరూ జస్టిస్ మహేశ్వరి తీర్పుతో ఏకీభవించారు.
దీనితో విభేదించిన మైనారిటీ న్యాయమూర్తులు 50% పరిమితిని ఉల్లంఘించడం వల్ల మరిన్ని చీలికలు వచ్చి విభాగాలు ఏర్పడుతాయని హెచ్చరించారు. సమానత్వ సూత్రం అప్పుడు రిజర్వేషన్ హక్కుగా మారిపోతుందని, మనం మళ్లీ చంపకం దురైరాజన్ రోజులకు వెళ్లిపోతామని మైనారిటీ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి రవీంద్ర భట్ తెలిపారు.
ఆయన తీర్పుతో సీజేఐ ఏకీభవించారు. రిజర్వేషన్లను తాత్కాలిక, అసాధారణ ఏర్పాటుగానే చూడాలని, లేదంటే అవి సమానత్వ సూత్రాన్ని మింగేస్తాయన్న అంబేద్కర్ మాటలను గుర్తుంచుకోవాలని జస్టిస్ భట్ పేర్కొన్నారు.