ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తులో భాగంగా అధికారులకు కీలక సమాచారం, ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో బేగంపేట్ ఎయిర్పోర్టుకు లింక్, ప్రైవేట్ చార్టెర్డ్ విమానాల ద్వారా పెద్ద ఎత్తున నగదు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
దీనికి సంబంధించి కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో చార్టెడ్ విమానాల ద్వారా నగదు తరలించినట్లు భావిస్తున్నారు. జెట్ సెట్ గో సంస్థపై ఈడీ ఆరా తీస్తోంది. జెట్ సెట్ గో కార్యకలాపాలపై వివరాలు ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖలు రాసింది.
ఇండో పసిఫిక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ను జెట్ సెట్ గో సంస్థ టేకోవర్ చేయగా, జెట్ సెట్ గో ద్వారా ప్రైవేట్ విమాన కార్యకలాపాలను అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి సతీమణి కనికారెడ్డి నిర్వహిస్తున్నారు.
కనికారెడ్డి కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు,.. అందులో ప్రయాణించినవారి వివరాలివ్వాలని గత నెల 17న ఈడీ లేఖ రాసింది. ఈడీ లేఖను దేశంలోని అన్ని ఎయిర్పోర్టు డైరెక్టర్లకు ఏఏఐ పంపింది. కనికారెడ్డికి చెందిన విమానాల్లో కీలక వ్యక్తులు, ప్రముఖులు ప్రయాణాలు సాగించినట్లు ఈడీ నిర్ధారించింది.
జెట్ సెట్ గో కార్యకలాపాలు, లావాదేవీల డేటా ఇప్పటికే ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్లిన వారి జాబితాను ఈడీ సేకరించినట్లు సమాచారం. బేగంటపేట ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో ఎయిర్ పోర్ట్ ఉండటంతో.. నేరుగా రన్ వే పైకి వీఐపీల వాహనాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
వీఐపీలతో కలిసి లిక్కర్ స్కామ్ సూత్రధారులు డబ్బు తరలించినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల అండతోనే స్కాం జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును ఈడీ అధికారులు అరెస్టు చేశారు.