దేశవ్యాప్తంగా గగుర్పాటు కలిగించిన దేశ రాజధాని ఢిల్లీలో ఆప్తాబ్ అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్దా వాకర్ ను దారుణంగా చంపి, మృతదేహాన్ని 35 భాగాలుగా కోసి, వివిధ ప్రాంతాలలో వీటిని పారేస్తూ వాస్తు సాక్ష్యాలు మాయం చేసి, ఐదారు నెలలపాటు ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యవహరించిన కేసులో లవ్ జిహాద్ కోణం వెలుగులోకి వస్తున్నది.
తన కూతురు శ్రద్ధా వాకర్ దారుణ హత్య వెనుక లవ్ జిహాద్ కోణం ఉండి ఉంటుందని ఈ యువతి తండ్రి వికాస్ వాకర్ తెలిపారు. ఈ దిశలో వెంటనే దర్యాప్తు చేపట్టాలని, హంతకుడిని కఠినాతి కఠినంగా శిక్షించాలని, తన దృష్టిలో ఉరితీయడం సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆమె వేరే ప్రాంతంలో ఉంటోందని తెలియచేసేలా ఆమె ఫోన్లో వాట్సాప్ సందేశాలను స్నేహితులకు పంపించడం, పైగా ఆమె దగ్గరి స్నేహితురాళ్లతో పరిచయాలు పెంచుకుని వారిని అపార్ట్మెంట్కు రప్పించుకోవడం వంటి చర్యలు చేస్తూ వచ్చాడని వెల్లడైంది.
ఆమెను మతం మార్చుకోవాలని ఈ దుర్మార్గుడు వేధించి ఉంటాడని, పైగా ఆమె నివాసం నుంచి బయటపడకుండా బందీగా ఉంచి ఉంటాడని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. శ్రద్ధ తనతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండేదని, ఆమె తన మేనమామతోనే సన్నిహితంగా ఉండేదని తండ్రి తెలిపారు. తనకు ఈ అఫ్తాబ్ అనే వ్యక్తి గురించి ఏమీ తెలియదని, కూతురు హత్య గురించి తెలియగానే ముంబై వాసాయ్లో పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు.
అఫ్తాబ్ పూనావాలా ఫుడ్బ్లాగర్ పనిచేసేవాడు. దేశ రాజధానిలో ఓ కాల్సెంటర్లో పనిచేస్తున్నప్పుడే శ్రద్ధాతో పరిచయం చేసుకున్నాడని, కలిసి జీవించారని ఢిల్లీ పోలీసుల దర్యాప్తు క్రమంలో తేలింది. అయితే తరువాతి దశలో తగవులకు దిగి ఆమెను చంపాలనే ఉద్ధేశంతోనే ఢిల్లీలో ఛత్రాపూర్ ప్రాంతంలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటాడని పోలీసులు తమ దర్యాప్తు క్రమంలో ముందుగా తేల్చారు.
ఇటీవలి కాలంలో ఇరువురూ తరచూ తగువు పడేవారు. ఈ దశలో కూడా ఆమె ఈ నివాసం నుంచి ఎందుకు బయటపడలేదనేది అంతుచిక్కలేదు. 2019 నుంచే వీరిద్దరి మధ్య సంబంధం ఉందని, తరువాత ఈ ఏడాదే మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి చేరారని వెల్లడైంది. తరచూ వివిధ ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లేవారు. వీరు మార్చి ఎప్రిల్ నెలల్లో హిల్స్టేషన్లకు వెళ్లారని పోలీసులు తెలిపారు. శ్రద్ధా దారుణ హత్యకు కొద్ది రోజుల ముందే అఫ్తాబ్ ఈ కొత్త నివాసానికి వచ్చినట్లు వెల్లడైంది.
బిజెపి నిరసన ప్రదర్శన
ఈ హత్యకు నిరసనగా ముంబైలో బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపి లవ్ జిహాదీ కోణం నుండి ఈ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో పలు చోట్ల మన యువతులను ఓ పధకం ప్రకారం లోబరచుకొని, దారుణాలకు పాల్పడుతూ ఉండడం వెనుక విదేశీ శక్తులు ఏవైనా ఉన్నాయో లోతుగా దర్యాప్తు జరపాలని బిజెపి ఎమ్యెల్యే రామ్ కదం కోరారు. ఇది లవ్ జిహాదీ ఘటనగా దర్యాప్తు జరపాలని నినాదాలు ఇచ్చారు.