భారత్ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్యను పోలిన ఈ సంఘటన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో జరిగింది. ఓ హిందూ యువతిని ముస్లిం ప్రియుడు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు.
అబూ బకర్ అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ నెల 6న అతడు పనికి రాలేదు. యజమాని ఫోన్ చేయగా స్విచ్ఆఫ్లో ఉంది. దీంతో అతడు అద్దెకున్న ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆ ఇంటి యజమాని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అక్కడకు వచ్చిన పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లారు. తలలేని యువతి మృతదేహం ఒక పెట్టెలో ఉండటం చూసి షాకయ్యారు. ఇంట్లోనే మరోచోట పాలిథిన్ కవర్లో ఆమె తల కనిపించింది. అయితే రెండు చేతులు మాయమయ్యాయి. మృతురాలిని కవితా రాణిగా పోలీసులు గుర్తించారు.
ఆమెను హత్య చేసిన ప్రియుడు అబూ బకర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మరో మహిళ స్వప్నతో కలిసి పరారైన అతడి ఆచూకీ గుర్తించి వారిద్దరినీ అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) అధికారి ఈ హత్య కేసు గురించి వెల్లడించారు.
ఆయన వివరాల ప్రకారం.. అబూ బకర్, స్వప్న గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గోబర్చక స్క్వేర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల హిందూ యువతి కవితా రాణితో అబూ బకర్కు పరిచయం ఏర్పడింది. ఈ నెల 5న స్వప్న విధులకు వెళ్లిన తర్వాత కవితను ఆ ఇంటికి పిలిచాడు. ఈ సందర్భంగా కవిత, అబూ మధ్య గొడవ జరిగింది.
దానితో, అబూ ఆగ్రహంతో కవిత గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించాడు. కవిత తల, చేతులు నరికాడు. మొండాన్ని ఒక పెట్టెలో దాచాడు. తల, చేతులను వేర్వేరుగా పాలిథిన్ కవర్లలో చుట్టాడు. చేతి భాగాలను ఆ ప్రాంతంలోని ఒక చోట పడేశాడు. సహజీవనం చేస్తున్న స్వప్నతో కలిసి ఢాకాకు పారిపోయాడు.
మరోవైపు కవిత హత్య సమాచారం అందుకున్న ఆర్ఏబీ సిబ్బంది ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌరస్తా ప్రాంతంలో అబూ బకర్, స్వప్నాను అరెస్టు చేశారు. అబూను ప్రశ్నించగా కవితను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
నరికిన చేతులను పాలిథిన్ కవర్లో చుట్టి పడేసిన ప్రాంతం గురించి చెప్పాడు. దీంతో ఆ చేతుల భాగాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడు అబూ బకర్ను సోనదంగ పోలీసులకు అప్పగించారు.