కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరాబుతున్నట్లు వస్తున్న కథనాలపై స్పందిస్తూ అందుకే ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని వెల్లడించారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటికి వస్తున్నట్టు తెలిపారు.
మర్రి శశిధర్ రెడ్డి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ లతో కలిసి శుక్రవారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. శశిధర్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన ట్విటర్ ఖాతాలో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. దీంతో ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమేనన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదని, మునుగోడు ఉప ఎన్నికను ఎంతో తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్ దే బాధ్యత అని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను చెంచాగాళ్లతో నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి బండి సంజరు ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ప్రారంభానికి ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.