ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోని అధికార శివసేన ఏక్నాథ్ షిండే వర్గం-బీజేపీ కూటమిలో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీని, సీఎం ఏక్నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతలు విమర్శలు చేస్తున్నారు.
దానితో ఈ వ్యవహారంపై మౌనం వీడిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మిత్రపక్ష నేత,ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీరును తప్పుబట్టారు. `శివాజీ మహారాజ్ మాకు దేవుడు. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన్ను పూజిస్తాం` అని గడ్కరీ వ్యాఖ్యానించారు.
శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోషియారీ మాట్లాడుతూ మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ కాలం చెల్లిన ప్రముఖుడు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. `మీ ఆరాధ్య నాయకులు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ అని జవాబులు వస్తాయి. మహారాష్ట్రలో చాలా మంది ఆరాధ్య నాయకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవం. ఇప్పుడు బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ` అని అన్నారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్లకు గౌరవ డాక్టరేట్ ప్రదానం సందర్భంగా కోషియారీ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోషియారీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి, సీఎం ఏక్నాథ్ షిండే శివసేన వర్గంతో కూడిన అధికార కూటమికి ఇబ్బందికరంగా మారాయి.
కోషియారీ వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన వర్గం, ఎన్సీపీ మండిపడ్డాయి. బీజేపీ నేతతో సమానంగా శివాజీ మహారాజ్ను సరిపోలుస్తూ మహారాష్ట్ర గొప్పతనాన్ని గవర్నర్ కించపరుస్తున్నారని ఆరోపించాయి.
గవర్నర్ వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ షిండే మౌనంగా వ్యవహరించడాన్ని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రశ్నించింది. శివసేన రెబల్ నేత, సీఎం షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఒకడుగు ముందుకు వేసి గవర్నర్ కోషియారీని మహారాష్ట్ర నుంచి సాగనంపాలని డిమాండ్ చేయడం చేశారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలు ఎన్నటికీ పాత తరానికి చెందినవి కావని సంజయ్ గైక్వాడ్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని మరే ఇతర గొప్ప వ్యక్తితోనూ శివాజీని పోల్చలేరని, గవర్నర్ దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు.
‘ఈ ప్రాంతం చరిత్ర, ఇక్కడ ఎలా పనిచేయాలో తెలియని గవర్నర్ లాంటి వ్యక్తిని ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే మరాఠీకి చెందిన వ్యక్తిని గవర్నర్ను చేయాలన్నది మా డిమాండ్. కోష్యారీని ఎక్కడికైనా పంపండి’ అని ఆయన స్పష్టం చేశారు.