మంత్రి మల్లారెడ్డి ఇంటిలో ఐటీశాఖ రెండు రోజులపాటు సాగించిన సోదాలు ముగిశాయని తెలుస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, కుమారులు, బంధువులు, సోదరులు ఇండ్లల్లో తనిఖీలు పూర్తయ్యాయని సమాచారం అందుతోంది. రెండు రోజుల పాటు 65 బృందాలతో ఐటీశాఖ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహించారు. 400 మంది ఐటీ అధికారులు దాదాపు 48 గంటల పాటు తనిఖీలు చేశారు.
సోదాలు ముగిసిన తర్వాత పంచనామా నివేదికలను మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు అందజేశారు. ఈనెల 28వ తేదీన( సోమవారం) ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో సీజ్ చేసిన ల్యాప్ టాప్ లను ఐటీ అధికారుల నుండి మంత్రి మల్లారెడ్డి అనుచరులు బలవంతంగా లాక్కున్నారు. దీంతో బోయిన్ పల్లి పీఎస్ వద్ద హైడ్రామా నడిచింది. తాను లేని సమయంలో తమ కుమారుడితో బలవంతంగా తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 8 బ్యాంకుల్లో 12 లాకర్స్ గుర్తించినట్లు సమాచారం. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రెండు డిజిటల్ లాకర్స్ సీజ్ చేసినట్లు తెలిసింది.
రాజశేఖర్ రెడ్డి టర్కీలో ఉండడంతో ఆయన కూతురు శ్రేయారెడ్డితో వాటిని ఓపెన్ చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే ఓపెన్ కాకపోవడంతో లాకర్లను సీజ్ చేశారు. ఇంట్లో ఉన్న వారికి నోటీసులు అందజేశారు. అలాగే కోఠిలోని ఎస్ బీఐ బ్యాంకులో రాజశేఖర్ రెడ్డికి చెందిన లాకర్లు ఉండడంతో శ్రేయారెడ్డిని అక్కడికి తీసుకెళ్లి వాటిని ఓపెన్ చేసి పరిశీలించారు.
పన్ను ఎగవేత ఆరోపణలతో మంత్రి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మంగళవారం సోదాలు ప్రారంభించిన ఐటీ.. బుధవారం సికింద్రాబాద్లోని మల్లారెడ్డి ఇల్లు, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొంపల్లిలోని కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, బంధువులు ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి ఇండ్లలో తనిఖీలు చేసింది.
బాలానగర్లోని క్రాంతి కోఆపరేటివ్ బ్యాంక్, సూరారంలోనిమల్లారెడ్డి- నారాయణ ఆసుపత్రిలోనూ సోదాలు జరిపింది. సంతోష్రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిసింది. శంషాబాద్లోని రాజశేఖర్రెడ్డికి చెందిన వర్ధమాన్ కాలేజీలోనూ ఐటీ సోదాలు చేసింది.
అధికారులు రెండ్రోజుల సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీలను సేకరించారు. అందులో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
గత ఆరేండ్లుగా ఆయా కంపెనీలు ఇన్కమ్ టాక్స్తో పాటు ఇతర టాక్స్ల చెల్లింపులో నిబంధనలు పాటించలేదని ఆధారాలుసేకరించినట్లు తెలిసింది. నగదు రూపంలో పెట్టుబడులు పెట్టారని, లెక్కలు లేకుండానే రూ.కోట్లు చేతులు మారాయని గుర్తించినట్లు సమాచారం. వీటికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో రూ.కోట్లలో పన్ను ఎగవేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మల్లారెడ్డి ఆగ్రవేశాలు
కాగా, అర్ధరాత్రి సమయంలో మంత్రి మల్లారెడ్డి.. గన్ మెన్, సెక్యూరిటీ లేకుండా కేవలం డ్రైవర్ తో హాస్పిటల్ కి వెళ్లారు. తప్పుడు పత్రాలపై ఐటీశాఖ అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. సిబ్బంది తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.
హాస్పిటల్ చికిత్స పొందుతున్న తమ పెద్ద కుమారుడుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పారు. దీనిపై మళ్లీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ మూడుసార్లు ఐటీ అధికారుల సోదాలు జరిగాయి కానీ, ఇంత దౌర్జ్యనం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.
‘మా ఇండ్లు, బంధువుల ఇండ్లల్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐటీ అధికారులు చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మా వాళ్లను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. వాళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురి చేస్తున్నారు’ అంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.