చైనా కదలికలపై అమెరికా సహా నాటో సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ చెప్పారు. ఇదే సమయంలో బీజింగ్ ఎదుర్కొంటున్న సైనిక సవాళ్లను కూడా నాటో పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాటో సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బ్లింకెన్ మాట్లాడుతూ సైనిక శక్తిని పెంపొందించుకుంటూ ఒకవైపు, రష్యాకు దగ్గరగా వస్తూ మరోవైపు చైనా శరవేగంగా విస్తరించడంపై అమెరికా నిశితంగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.
చైనా అనుసరిస్తున్న విధానాలు కలవరపెడుతున్నాయని చెబుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, అంతే కాకుండా సైనిక శక్తిని పెంచుకుంటున్న వేగంపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. రష్యాతో కుమ్మక్కైన విషయం ఏనాడో గుర్తించామని, అయినప్పటికీ చైనాతో మాట్లాడుతామని పేర్కొన్నారు.
రష్యా, చైనాలకు చెందిన యుద్ధ విమానాలు జపాన్ సముద్ర సరిహద్దు వద్ద ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించారు. అలాగే, రెండు చైనీస్, 6 రష్యా యుద్ధ విమానాలు దక్షిణ కొరియా సమీపంలో ప్రయాణించాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
చైనా 2035 నాటికి 1500 అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నదని రెండు రోజుల క్రితం పెంటగాన్ నివేదిక ఒకటి వెల్లడించింది. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై దాడికి ముందు రష్యా, చైనాలు సైనిక ఒప్పందం కూడా చేసుకోవడం అమెరికాను కలవరపెడుతున్న మరో అంశంగా చెప్పుకోవచ్చు.
భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తలపై విమర్శ
మరోవంక, తాజాగా అమెరికా కాంగ్రెస్ కు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సమర్పించిన నివేదిక తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను తక్కువ చేసి చూపించడానికి చైనా అధికారులు ప్రయత్నించారని పేర్కొంది. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకుంటూ, భారత దేశంతో ఇతర ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని చైనా కోరుకున్నట్లు తెలిపింది.
చైనీస్ మిలిటరీపై ఇచ్చిన ఈ నివేదికలో ‘చైనా-భారత్ సరిహద్దు’ అనే విభాగంలో, సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు అమెరికాతో భారత దేశం మరింత సన్నిహిత భాగస్వామ్యానికి కారణమవడాన్ని నిరోధించాలని చైనా కోరుకుందని పెంటగాన్ తెలిపింది. భారత దేశంతో చైనా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధికారులను చైనా అధికారులు హెచ్చరించారని తెలిపింది.
2021లో చైనా సైన్యం తన దళాలను భారీగా మోహరించి, వాస్తవాధీన రేఖ వెంబడి రోడ్లు, తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కొనసాగించిందని తెలిపింది. సరిహద్దులో భావిత ప్రయోజనాలను కోల్పోవడానికి ఇరు పక్షాలు నిరాకరించడంతో చర్చల వల్ల ఫలితం నామమాత్రంగా ఉందని పేర్కొంది.
తూర్పు లడఖ్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు 2020 మే నెలలో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ కూడా జరిగింది. దీంతో ఇరు దేశాలు తమ వైపు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకున్నాయి.
‘మీ దళాలను ఉపసంహరించండి. ప్రతిష్టంభనకు పూర్వపు స్థితిని తీసుకురండి’ అని భారత్, చైనా పరస్పరం డిమాండ్ చేసుకున్నాయని ఈ నివేదిక పేర్కొంది. అయితే ఈ షరతులను ఇరు దేశాలు అంగీకరించలేదని పేర్కొంది. 2025 జూన్ 15న గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారులు చెప్తున్నారని తెలిపింది.