కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) సూచించింది. లేకపోతే మరో కొత్త వేరియంట్ విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించింది. నిఘా, పరీక్షలు, వ్యాక్సిన్లతో వైరస్పై నియంత్రణ సాధించగలిగామని పేర్కొంది.
కరోనాను అడ్డుకునే వ్యూహాత్మక యత్నాల వైఫల్యంతో ఈ ఏడాది కొత్త వేరియంట్ పుట్టుకువచ్చే పరిస్థితులు ఉండవచ్చని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు. మహమ్మారి అత్యవసర దశ ముగిసిందని చెప్పడానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. కానీ ఇప్పుడే ప్రకటించలేమని చెప్పారు.
చైనాలో వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాల రోగాలు కలిగిన వారు, 60 ఏళ్లు దాటిన వారిపై చైనా సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని డబ్ల్యుహెచ్ఒ టెక్నికల్ లీడ్ మారియా వాన్ ఖేర్గోవ్ స్పష్టం చేశారు.
ప్రపంచ జనాభాలో దాదాపు 90 శాతం మంది ఇప్పుడు కరోనా వైరస్ సోకడం ద్వారా, వ్యాక్సిన్ కారణంగా కొంత మేర రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని డబ్ల్యుహెచ్ నివేదిక పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్లతో విరుచుకుపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.