తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..‘భారత్ రాష్ట్ర సమితి‘ గా మార్చడాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సిఎం కెసిఆర్కు అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన ‘భారత రాష్ట్ర సమితి‘ ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో (ఒంటిగంట 20 నిమిషాలకు) తనకు అందిన అధికారిక లేఖకు సమాధానంగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం సిఎం బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు.
వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాల రెతుబంధు సమితి అధ్యక్షులను, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ మధ్యాహ్నంలోగా తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సిఎం కెసిఆర్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా శుభఘడియల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ పేరును మారుస్తూ దసరా రోజున నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు అని కేసీఆర్ ఆ రోజున తీర్మాన ప్రతిని చదివి వినిపించారు.