రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో షుమారు 88 శాతం మంది నేటికి మన సమాజంలో చీత్కారాలు, అవమానాలు తో పాటు వివక్షతకు గురవుతున్నారని అక్రమ రవాణా భాదితుల రాష్ట స్థాయి భాదిత మహిళా సంఘం “విముక్తి” రాష్ట్ర నాయకులు శ్రీమతి అపూర్వ , శ్రీమతి పుష్ప, మౌనిక, భాజీవలి, లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు.
తాము మనుషులమని, తమకు మానవ హక్కులు వరిస్తాయనే విషయం కూడా తెలియక, తామే ఏదో చేయకూడని కఠిన నేరాలు చేసిన నేరస్తులుగా భావించుకొంటూ, నేటికి ఈ సమాజంలో తమ వెతలు, భాధలు, కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
*“అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం”* పురష్కరించుకొని శుక్రవారం విజయవాడలో మీడియాతో విముక్తి రాష్ట్ర అధ్యక్షరాలు శ్రీమతి అపూర్వ మాట్లాడుతూ తమకు తెలియకుండానే ఎవరి చేతనో మోసగించబడి బలవంతంగా వ్యభిచారం లోకి నెట్టబడి, వివిధ సమస్యలు, హింస, వివక్షత ఎదుర్కొంటున్న భాదిత మహిళలకు కుడా ఈ మనవ హక్కులు వర్తిస్తాయనే విషయం ప్రభుత్వ అధికారులు, పాలకులు, సమాజంలో ఉన్న పెద్ద మనుష్యులుకు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నించారు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అలాగే జాతీయ మనవ హక్కుల కమీషన్ తమ వివిధ తీర్పు లలో వ్యభిచారం లో మగ్గుతున్న లేదా బయటకు వచ్చిన మహిళలకు అన్ని మానవ హక్కులు వర్తిస్తాయని, వారి మానవ హక్కులకు ఉల్లంఘన జరగకుండా భద్రత కల్పించాల్సిన భాద్యత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశాయని ఆమె గుర్తు చేశారు.
అలాగే వారికీ సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు కల్పిస్తున్న అన్ని పధకాలు, సౌకర్యాలు వెంటనే అందించ వలిసిన భాద్యత కూడా ప్రభుత్వ అధికారుల దే అని కూడా స్పష్టం చేసినా నేటికి ఎక్కడ అవి అమలుకు నోచుకోవడం లేదని విముక్తి కార్యదర్శి శ్రీమతి .పుష్ప ఆవేదన వ్యక్తం చేసారు.
ఇటీవల హెల్ప్ సంస్థ, సంజోగ్ సంస్థ సహకారంతో రాష్ట్రంలో ఈ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షత పై జరిపిన సర్వే ప్రకారం 88% భాదితులు, సెక్స్ వర్కర్లు వివక్షను ఎదుర్కొంటున్నారని అపూర్వ చెప్పారు.
వివక్షకు ప్రధాన కారకులు తక్షణ కుటుంబ సభ్యులు- తల్లిదండ్రులు, భాగస్వాములు (37%), బంధువులు (16%), పొరుగువారు (27%) అని వివరించారు. 63% మానవ అక్రమ రవాణా భాదితులు, సెక్స్ వర్కర్లు వివక్ష ఎదుర్కొన్నప్పుడు కుటుంబం నుండి ఎటువంటి మద్దతు పొందడం లేదని,
కుటుంబ సభ్యుల్లో అసలు ఏమాత్రం మద్దతు ఇవ్వని వారు తల్లిదండ్రులు, సోదరులని తెలిపారు. కాపాడిన అక్రమ రవాణా భాదితుల కోసం షెల్టర్ హోమ్ల ద్వారా పునరావాసాన్ని కల్పించే విధానానికి బదులుగా కమ్యూనిటీ-బేస్డ్ రీహాబిలిటేషన్ (సిబిఆర్) మోడల్ ను అమలు పరచాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.
మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి భారతదేశం కేవలం స్పందిచడం మాత్రమే కాకుండా ఒక విధానాన్ని అభివృద్ధి చేయాలని విముక్తి డిమాండ్ చేసింది. క్రియాశీలమైన దర్యాప్తు చేపట్టడం ద్వారా మానవ అక్రమ రవాణా జరిగే మూల స్థానాల్లో ట్రాఫికర్లను కనుగొని శిక్షలు పడేలా చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.
భాదితులకు నష్టపరిహారం పొందడంలో గణనీయమైన పెరుగుదల అవసరం అని పేర్కొంటూ దీనిని ఎక్కడ అమలు చేయడంలేదని గుర్తించేందుకు పర్యవేక్షణ సంస్థలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వాలు పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు. సిబిఆర్ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయడం ద్వారా దీనిని ప్రభుత్వ పునరావాస విధానం లో భాగంగా చేర్చాలని, రుణ వలయాన్ని తగ్గించడం, క్విడ్ ప్రోకోగా ఒప్పంద కార్మికులను పెంచడం చేయాలని పేర్కొన్నారు.