నరేంద్రమోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందువుగా నిలుస్తున్నదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ప్రధాని మోదీ లక్ష్యంగా భుట్టో వ్యక్తిగత దూషణకు దిగారు. ‘బిన్లాడెన్ చనిపోయాడు. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడు. అతడే భారత ప్రధాని మోదీ’ అని వ్యాఖ్యానించారు.
దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు పాక్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడింది. బిన్ లాడెన్ను అమరుడిగా కీర్తించిన దేశం పాక్ అని, జకీర్ రెహ్మాన్ లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీం లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ధ్వజమెత్తారు.
భుట్టో వ్యాఖ్యలు పాకిస్థాన్ మరింత దిగజారుడుతనానికి నిదర్శనమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి పిచ్చి ప్రేలాపన ఆ దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను నియంత్రించలేని అసమర్థతకు నిదర్శనంగా కనిపిస్తోందని దుయ్యబట్టింది.
ఐక్యరాజ్యసమితిలో బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలను దృఢంగా, నిస్సందేహంగా ఖండిస్తున్నామని పేర్కొంది. భారత్పై దుష్ప్రచారం చేసే అర్హత పాకిస్థాన్కు లేదని, ముందు ‘మేకిన్ పాకిస్థాన్ టెర్రరిజాన్ని’ ఆపాలని హితవు పలికింది.మరోవైపు భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ కామెంట్స్పై భారత్ తీవ్రంగా స్పందించింది. 1971లో జరిగిన యుద్ధంలో ఇదే రోజు ఏం జరిగిందో భుట్టో మర్చిపోయారేమో అని ఘాటుగా జవాబిచ్చింది. పాక్ విదేశాంగ మంత్రి 1971లో ఈ రోజు ఏం జరిగిందో మర్చిపోయినట్లు ఉన్నారు.. బెంగాలీలు, హిందువులపై జరిపిన మారణ హోమానికి ఫలితంగా ఆ రోజు బాంగ్లా యుద్ధంలో దారుణ పరాభవాన్ని చవి చూసిన విషయం మర్చిపోయినట్లున్నారు అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
భుట్టో వ్యాఖ్యలు దిగజారుడు తనానికి పరాకాష్ట అని మండిపడింది. పాక్ విదేశాంగ మంత్రి స్వదేశం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, నిస్పృహతో ఇలా అనాగరికంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. పాక్ విదేశాంగ మంత్రి 1971లో ఈ రోజు ఏం జరిగిందో మర్చిపోయినట్లు ఉన్నారు..బెంగాలీలు, హిందువులపై జరిపిన మారణ హోమానికి ఫలితంగా ఆ రోజు బాంగ్లా యుద్ధంలో దారుణ పరాభవాన్ని చవి చూసిన విషయం మర్చిపోయినట్లున్నారని మండిపడింది.